హైదరాబాద్ ఆట ప్రతినిధి, డిసెంబర్ 12 : పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులపై ‘ప్రాజెక్ట్ మాసూమ్’ అవగాహన కల్పించడం అభినందనీయమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నారు. సీఐఐ యంగ్ ఇండియన్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాంటీ రోడ్స్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రాజెక్ట్ మాసూమ్లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడిపై సమాజంలో అవగాహన కొరవడిందని, ఇది భారత్తో పాటు దక్షిణాఫ్రికాలోనూ ఉందని చెప్పారు. లైంగికంగా వేధిస్తున్న వారి గురించి ఎలా బయటికి చెప్పాలో పిల్లలకు అర్థం కావడం లేదని, ఇందుకోసం సరైన అవగాహన కల్పించేందుకు మాసూమ్ ప్రాజెక్ట్ పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా చైర్మన్ అషుతోశ్ దీన్దయాళ్, వైస్ చైర్పర్సన్ శివాని, తదితరులు పాల్గొన్నారు.