మైలార్దేవ్పల్లి, మే 18 : పాతబస్తీలోని గుల్జార్హౌస్ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మైలార్దేవ్పల్లిలోని మొఘల్ కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పడమే కాకుండా మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడంతో పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం తప్పింది. మైలార్ దేవ్పల్లి డివిజన్ ఉడ్డెంగడ్డ, మొఘల్స్ కాలనీ ప్రాంతంలో షేక్ మాజీద్కు చెందిన మూడంతస్తుల భవనంలో మరో ఏడు కుటుంబాలు అద్దెకుంటున్నాయి.
ఆదివారం ఉదయం భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ మీటర్ల వద్ద షార్ట్ సర్యూట్ ఏర్పడింది. మంటలు గ్రౌండ్ ఫ్లోర్లోని పాత ఫర్నీచర్, ఇతర వస్తువులకు వ్యాపించడంతో భవనంలోని మూడు అంతస్తుల వరకు దట్టమైన పొగ అలుముకుంది. ఒక్కసారిగా మంటలు, పొగల ధాటికి నిద్రలేచి, బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో భవనం టెర్రస్ పైకి పరుగులు తీసి, హాహాకారాలు చేశారు. చాంద్రాయణగుట్ట ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసి.. చిక్కుకుపోయిన 16 మంది పిల్లలు, 34 మంది పెద్దలు, వృద్ధులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు.