వికారాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలను ఆర్థికంగా బలోపేతం చేసి ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
రైతు బంధు పథకానికి ముందు..
రైతు బంధు పథకానికి ముందు వానకాలం, యాసంగి సీజన్ వచ్చిందంటే చాలు అప్పు కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి నెలకొని ఉండేది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీకి అప్పులు ఇవ్వడంతోపాటు అప్పుకు బదులుగా పండించిన పంటను వడ్డీ వ్యాపారులే తీసుకొని చేసిన అప్పు, వడ్డీ పోనూ మిగిలింది ఇంతేనంటూ ఎంతో కొంత ఇచ్చి రైతులను మోసం చేసేవారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, కమీషన్ ఇచ్చి మరీ బ్యాంకుల నుంచి రుణాలు పొందే దయనీయ పరిస్థితి ఉండేది. పంట పెట్టుబడికి తీసుకున్న అప్పులను తీర్చేందుకు చాలా మంది రైతులు తమ భూములను అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు..
అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు విత్తనాలు, ఎరువుల పెట్టుబడి నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక సాయమందించేందుకు రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10వేల సాయాన్ని ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నది. తొలుత రెండేండ్లు ఎకరాకు రూ.8 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించగా.. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిన నేపథ్యంలో రైతుల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2018 నుంచి సంవత్సరానికి ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతులకు అందజేస్తున్నారు.
క్రమంగా తగ్గుతున్న పంట రుణాలు
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ సర్కార్ ఈ ఏడేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రెండేండ్లలోనే ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. ఈ వానకాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి రైతులను లాభాల బాటలో నడపాలని ముందుకెళ్తున్నది. రైతు బంధు పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి క్రమంగా పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య తగ్గుతున్నది. రైతు బంధు సాయంతో ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేస్తున్న రైతులు.. రుణాలపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు గత ఆరేండ్లుగా వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి పోయింది. రైతు బంధు పథకానికి ముందు జిల్లాలో ఏడాదికి 2 లక్షల మంది రైతులకు సుమారు రూ.1900 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ప్రస్తుతం రుణాలు పొందే రైతుల సంఖ్య లక్షకు మించకపోవడం గమనార్హం. చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతోపాటు సాగు నీరందించేందుకు ప్రాజెక్టులను నిర్మించ తలపెట్టడంతో పంట దిగుబడి ఆశించిన దానికంటే అధికంగా రావడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో రోజురోజుకూ రైతే రాజు అనే విధంగా అన్నదాతల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.