వికారాబాద్, అక్టోబర్ 8 : సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక పంటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. రైతులకు లాభాలు, ప్రజలకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సరికొత్త ఆలోచనతో వినూత్న పద్ధతుల్లో పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు వేగంగా విస్తరిస్తున్నది. కొత్త పంటలు సాగు చేయాలనే ఉత్సాహంతో రైతులు నూతన సాగు పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అనేక రకాల యాంటి ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్స్ రెండు రకాలు. ఒకటి తెలుపు రంగులో ఉంటుంది. మరోటి గులాబీ రంగులో ఉంటుంది. తెలుపు రంగులో ఉన్నవి కాస్త పుల్లగా.. గులాబీ రంగులో ఉన్న పండు టేస్టీగా ఉంటుంది. ఇది క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనేక రకాల విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫైబర్ తదితర మేలు చేసే గుణాలు ఉంటాయని చెబుతున్నారు. ఒక డ్రాగన్ ఫ్రూట్ దాదాపు 100 కేలరీల శక్తిని అందిస్తుందని, కొవ్వును కలిగి ఉండదని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇది రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఈ పంటను సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నారు. పంటలకు అవసరమైన సలహాలు, సూచనలు, సబ్సిడీలు అందించి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ మొక్క ధర రూ.50 నుంచి రూ.70ల వరకు ఉంటుంది. సిమెంట్ దిమ్మెలు, డ్రిప్ సాయంతో పంటను సాగు చేయవచ్చు. సేంద్రియ ఎరువులు వాడితే పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ సాగు ఒక్క సారి నాటితే దాదాపు 25 నుంచి 30 ఏండ్ల వరకు పంట సాగు అవుతుంది. 7 ఫీట్ల సిమెంట్ దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలను నాటవచ్చు. తీగ పద్ధతిలో ఈ పంటను సాగు చేయవచ్చు. మరో సిమెంట్ దిమ్మెకు మధ్యన 9 ఫీట్ల దూరం ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టును దిమ్మె చుట్టూ అల్లి కిందకు జారకుండా దారంతో కట్టాలి. ఇది ఏడాదిలో మూడు సార్లు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ నీటిని ఉపయోగించి పంటలు సాగు చేసుకోవచ్చు. ఇతర పంటల కంటే చీడ పీడలు తక్కువగా వ్యాపిస్తాయి. మొదటి ఏడాది మాత్రమే పెట్టుబడి పెట్టాలి. తర్వాత సంవత్సరం నుంచి పెట్టుబడి లేకుండా పంట సాగు చేయవచ్చు. 500 దిమ్మెలకు 2వేల మొక్కలు నాటే అవకాశం ఉంది. పంట పెంటుబడికి రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మొక్కలకు నాలుగు రోజులకోసారి నీరు పట్టాలి. వర్షం పడితే వారం వరకు నీరు పోసే అవకాశం ఉండదు. నీరు ఎక్కువగా పడితే మొక్కులు త్వరగా పాడవుతాయి. డ్రాగన్ ఫ్రూట్ మొగ్గగా మారినప్పటి నుంచి పండుగా మారాలంటే 45 రోజుల సమయం పడుతుంది. 45 రోజుల తర్వాత పండును తినవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ దాదాపు 2 నెలల వరకు పాడుకాకుండా భద్రపర్చుకోవచ్చు. దూర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు బాక్స్లలో వేసి భద్రపర్చాలి. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించి పంట దిగుబడి పెంచుకోవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం కిలో ధర రూ.100 నుంచి రూ.140ల వరకు ఉంది. పంటను కోసిన తర్వాత 2 నెలల వరకు పండు పాడు కాకుండా నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్లో అమ్ముకొనే అవకాశాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కను సైతం విత్తనంగా మార్చి మరో మొక్కను తయారు చేయవచ్చు. పొలంలో తక్కువ స్థలంలో నర్సరీగా మార్చి సీడ్స్ పెంచవచ్చు. దాంతో ఇతరులకు సీడ్స్ అమ్మి ఆదాయం పొందవచ్చు. లేదా మరో ఎకరా పొలంలో నాటి పంటను సైతం తక్కువ పెట్టుబడితో సాగు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యానవన శాఖ అధికారులు సైతం పంట సాగుకు విడతల వారీగా డబ్బులు మంజూరు చేస్తారు. పంట వేసిన మూడేండ్ల వరకు పెట్టుబడులు పోను, తర్వాత లాభాలే మిగులుతాయి. చిన్న పాటి మెళకువలు పాటించి పంటలు దిగుబడి పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఐదెకరాల పొలం ఉంది. తక్కువ ఖర్చుతో ఎ క్కువ లాభం వచ్చే పంటలు సాగు చేయాలనే ఆలోచనతో డ్రాగన్ ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాను. మూడు ఎకరాల్లో రెండు వేల మొక్కలు నాటాను. దాదాపు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఖర్చు అయింది. వీటిలో గులాబీ రంగు డ్రాగన్ ఫ్రూట్ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వికారాబాద్తో పాటు వరంగల్, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఈ పండ్లను ఆర్టీసీ కార్గో సేవల ద్వారా సరఫరా చేస్తున్నా. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే దిగుబడి ఎక్కువగా వస్తుంది. సేంద్రియం ఎరువులను కొనుగోలు చేసి, తయారు చేస్తున్నా. ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్ నర్సరీని సైతం ఏర్పాటు చేసుకున్నాను. ఎరువులు, మందులు పిచికారీ చేసేందుకు, పండ్లను కోసేందుకు అవసరమైన కూలీలను ఏర్పాటు చేసుకొని పండ్లను అమ్మకానికి పంపిస్తున్నా. డ్రాగన్ ఫ్రూట్ తో పాటు మిగిలిన కొంత స్థలంలో జామ, మామిడి, అల్లనేరెడు, కొ బ్బరి, అరటి తదితర మొక్కలు నాటి పండ్ల పెంపకం చేపట్టా. డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందిస్తున్నా. 85 క్వింటాళ్ల వరకు దిగువడి రావడంతో రూ.6లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదా యం పొందుతున్నా.
సన్న, చిన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.2లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. పంటకు పనికి రాని, బీడు భూమిలో సైతం డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేసుకోవచ్చు. ఎక్కువ నీరు అవసరం లేకుండా తక్కువ నీటితో సాగు చేయవచ్చు. సేంద్రియ ఎరువులు వాడితే పంట దిగుబడి అధికం అవుతుంది. జాబ్ కార్డులు కలిగిన రైతులకు అవకాశం ఉంది. సంవత్సరానికి మూడు పంటలు సాగు చేసుకోవచ్చు. లాభంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. పంట పెట్టుబడికి పెట్టిన ఖర్చులు మూడేండ్లలో వస్తాయి. మరుసటి సంవత్సరం నుంచి 25 ఏండ్ల వరకు పెట్టుబడి అవసరం లేకుండా లాభాలు వస్తాయి. చిన్నపాటి మెళకువలతో పాటు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు వస్తాయి. రైతులే ఆర్థికంగా ఎదిగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉన్న రైతులు 7997725221 నంబర్ను సంప్రదించాలి.