మర్పల్లి, ఆగస్టు 5 : వ్యవసాయానికి ఆధారం కాడెడ్లు.. అందుకే రైతులు వాటిని ప్రాణంలా చూసుకుంటారు.. సాగు పనుల్లో కీలక పాత్ర పోషించే ఈ ఎడ్లను అన్నదాతలు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు.. పొలాన్ని చదును చేసి విత్తనాలు వేసేంత వరకు, పొలాల్లో నాగలి, గొర్రు తోలడం, మొక్కజొన్న, మిరప తదితర పంటలు నాటేందుకు అచ్చు వేయడం, పంటల్లో కలుపు తీసేందుకు గుంటుక తోలడం వంటి పనులను ఎడ్లను ఉపయోగిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లోకి అత్యాధునిక యంత్రాలు వచ్చినా ఎడ్లకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. మొక్కజొన్న, కంది, పత్తి పంటల్లో కలుపు తీతకు తప్పనిసరిగా గుంటుక తోలడం కోసం కాడెడ్లు అవసరం ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగింది.
చేతినిండా పని..
గతంలో ప్రతి ఇంటిలో రైతులు తమ వ్యవసాయ పనులకు, మరికొన్ని ఆవులు, పాడి గేదెలను పెంచుకునేవారు. వాటికి మేత కోసం కొంత భూమిని వదిలి వేసేవారు.. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో యంత్రాలు ఎక్కువ వచ్చి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి తోడు వ్యవసాయ పనుల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ నాగళ్లతో పొలం చదును చేయడం, గుంటుక తోలడం, గొర్రు తోలడం, విత్తనాలు వేయడం వంటి పనులు చేసుకునేవారు. పశుగ్రాసం, కూలీల కొరతతో పాటు చిన్న, సన్నకారు రైతులకు పశుపోషణ భారమై గ్రామాల్లో పశువుల సంఖ్య క్రమేపి తగ్గింది. ఆధునిక వ్యవసాయ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవసాయ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందించడంతో గ్రామాల్లో, తండాల్లో ట్రాక్టర్ల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కొందరు రైతులు మాత్రం నేటికీ కాడెడ్లతో వ్యవసాయం చేస్తున్నారు. పంటల్లో కలుపు తీసేందుకు ట్రాక్టర్లు, ఇతర యంత్రాల కంటే ఎడ్లతోనే ఎక్కువ ఉపయోగం ఉండడం వల్ల ఎడ్లున్న రైతులకు చేతినిండా పని ఉంటుంది..
గ్రామాల్లోనే ఉపాధి..
గ్రామాల్లో కాడెడ్లున్న వారికి ఉపాధి దొరుకుతుంది. పొలాలు చదును చేయడం, పత్తి విత్తనాలు నాటేందుకు అచ్చు వేయడం, విత్తనాలు వేసేందుకు గొర్రు తోలడం వంటి తదితర పనులకు రోజుకు రూ.1500 నుంచి రూ.2000 వేల వరకు తీసుకుంటున్నారు. అదనంగా ఇంకో కూలీకి రూ.500 ఇచ్చి మరి కలుపు తీత పనులు చేయిస్తున్నారు.. ఇలా ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వ్యవసాయ పనులతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వర్షాలు ఎక్కువ పడటంతో పొలాల్లోని పంటల్లో కలుపు మొక్కలు, గడ్డి ఎక్కువ పెరిగి పోవడంతో గుంటుక, దంతెలకు మరింత డిమాండ్ పెరిగింది.
అరకతోనే లాభాలు..
గతంలో ఫొటోగ్రాఫర్ వృత్తిని వదులుకొని రూ.లక్షా 20 వేలతో రెండు ఎడ్లను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నా. విత్తనాలు వేసేందుకు ఎడ్లతో దున్నితేనే మంచి ఫలితాలు ఉంటాయి.. ట్రాక్టర్ల అద్దె, కూలీలకు పని పెరుగడంతో కాడెడ్లకు డిమాండ్ పెరిగింది. రోజుకు రూ.1500 నుంచి రూ.2000 వస్తుంది.
– పి.మల్లేశం, బూచన్పల్లి