రంగారెడ్డి, జూలై 11(నమస్తే తెలంగాణ) ;రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ఖిల్లాగా మారింది. ఉపాధి కల్పనలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం సిద్ధించాక పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. టీఎస్ఐపాస్ చట్టంతో త్వరితగతిన అనుమతులు మంజూరు కావడంతో పాటు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం సమకూర్చుతుండడంతో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా వేదికైంది. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిని సారించిన రాష్ట్ర సర్కార్ రూ.47వేల 62 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమలను స్థాపించింది. దీంతో 5,15,851 మందికి ఉపాధి లభిస్తుండడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో 16 పారిశ్రామిక పార్కులు ఉండగా.. మరో మూడు పార్కుల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. కొత్తగా మరో 19 ఇండస్ట్రియల్ పార్కులనూ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విస్తృతంగా ఏర్పాటవుతున్న ఇండస్ట్రియల్ పార్కులతో గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.
పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కొత్త పరిశ్రమలను ఆకర్షించడంతోపాటు ఉన్న పరిశ్రమల విస్తరణకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఉపాధి అవకాశాలను పెద్దఎత్తున కల్పించడానికి పారిశ్రామిక రంగం ప్రధానమైనదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. ప్రధానంగా.. అనుమతులకు అనవసర జాప్యాలు.. ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసింది. ఫలితంగానే రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయి. అయితే పారిశ్రామిక రంగంలో.. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటిని మారుమూల ప్రాంతంలోనైనా ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో స్థానికులకే ఎక్కువగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు ప్రాధాన్యమిస్తున్నది.
కొత్తగా మరో 19 ఇండస్ట్రియల్ పార్కులు
రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 19 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. భూ సేకరణ కోసం కలెక్టర్కు ప్రతిపాదనలను కూడా పంపించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే దశలవారీగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణా కేంద్రం వంటివి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఈ పార్కుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పరిశ్రమల స్వర్గధామంగా రంగారెడ్డి జిల్లా
స్వరాష్టం ఏర్పాటు తర్వాత రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రంగారెడ్డి జిల్లాలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరును సులభతరం చేసింది. దీనికితోడు 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన పరిశ్రమలకు వరంగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో రంగారెడ్డి జిల్లా ఆకర్షణీయ గమ్యస్థానమైనది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో కేవలం 3,328 కోట్ల పెట్టుబడులతో 2,777 పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయి. అప్పట్లో కేవలం 45,763 మందికి మాత్రమే ఉపాధి కల్పించబడింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెద్దఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో ప్రస్తుతం జిల్లాలో 47,062 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 5,15,851 మందికి ఉపాధి కల్పించబడుతున్నది. ప్రముఖ సంస్థలైన ఫాక్స్కాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, బోయింగ్, విప్రో, ప్రీమియర్ ఎనర్జీస్, రేడియంట్, ఓరియంట్, అస్ర్తాల్ వంటి పరిశ్రమలు ఏర్పాటై వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉపాధి కల్పనలో 57 శాతంతో రాష్ట్రంలోనే అగ్రగామిగా రంగారెడ్డి జిల్లా నిలుస్తున్నది.
ఉపాధికి కేరాఫ్గా ఇండస్ట్రియల్ పార్కులు
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 16 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటయ్యాయి. ఆదిబట్ల ఐటీ, హార్డ్వేర్ పార్క్ ఫేజ్-1, 2, ఫ్యాబ్ సిటీ, ఆదిబట్ల ఏరోస్పేస్, నాదర్గుల్ ప్రెసీసియన్ ఇంజినీరింగ్ పార్కు, మంఖాల్ పార్కు, కాటేదాన్, కొత్తూర్లలో ఐడీఏ, హయత్నగర్ ఆటోనగర్, మహేశ్వరం ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్, ప్లాస్టిక్ పార్కు, ఇబ్రహీంపట్నం ఎంఎస్ఎంఈ, చందనవల్లి పార్కు, మహేశ్వరం జనరల్ పార్కు, కొంగరకలాన్లోని ఇండస్ట్రియల్ పార్కులు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. వివిధ దశల్లో మరో మూడు సిద్దాపూర్ పార్కు, ఫార్మాసిటీ, ఎలిమినేడు పార్కులు పురోగతిలో ఉన్నాయి. స్వరాష్ట్రంలోనే రావిర్యాల(ఈ-సిటీ), మహేశ్వరంలోని రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్, ముచ్చర్ల ఫార్మాసిటీ, చందనవల్లి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటయ్యాయి. 19,333 ఎకరాలలో రూ.63వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీ ద్వారానే లక్ష మందికి పైగా ఉపాధి లభించనుంది.