సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులకు క్షణాల్లో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్లు ఎంతో మెరుగైన సేవలనందిస్తున్నాయి. ఓఆర్ఆర్పై ప్రతి రోజూ సుమారు 1.30 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 2016 వరకు ఓఆర్ఆర్ ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. గడిచిన 5-6 ఏండ్లుగా ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.
2016లో 110, 2021లో 50లోపు, 2022లో 38 ప్రమాదాలు తక్కువగా నమోదయ్యాయి. ఏడాది మొత్తంలో 1098 ప్రమాద సంఘటనలు జరుగడంతో వెంటనే అంబులెన్స్లు ఓఆర్ఆర్పైకి చేరుకొని అత్యవసర చికిత్సనందించాయి. దీని ఫలితంగానే ఓఆర్ఆర్పై ప్రమాదాలు జరుగుతున్నా, గోల్డెన్ అవర్లో అత్యవసర వైద్య చికిత్సను అందించడం వల్ల మృతుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నదని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు తెలిపారు. ఓఆర్ఆర్ ప్రారంభమైన మొదట్లో ఓఆర్ఆర్పై వాహనాల వేగం గంటకు 120 కి.మీ ఉండగా, ప్రస్తుతం గంటకు మొదటి రెండు వరుసల్లో 100 కి.మీ, తర్వాతి రెండు వరుసల్లో 80 కి.మీ వేగంతో వెళ్లేలా చేశారు. పోలీసులతో కలిసి వేగనియంత్రణ కోసం స్పీడ్ గన్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి.
ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ట్రామా కేర్ సెంటర్లు
ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల పాటు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం 19 ఇంటర్చేంజ్లు ఉండగా, 16 చోట్ల ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రమాద సమయంలో అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారు. మొత్తం 16 ట్రామా కేర్ సెంటర్లతో పాటు 10 అంబులెన్స్లు (అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్) ఓఆర్ఆర్పైనే అందుబాటులో ఉండి, ప్రమాదం జరిగిందని సమాచారం వచ్చిన 5-10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సను అందించేలా అంబులెన్స్లోనే అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వైద్య సేవలను అందించడంలో అపోలో, యశోద ఆస్పత్రులు సహకారం అందిస్తున్నాయి. ట్రామా కేర్ సెంటర్లో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే టెలి మెడిసిన్ సదుపాయం ఉందని తెలిపారు.