కులకచర్ల, ఫిబ్రవరి 6 : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహించాలన్నారు. గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడూ అప్డేట్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, పరిగి సీఐ వెంకటరామయ్య, ఎస్ఐ గిరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి వ్యక్తికీ న్యాయం చేయాలి
దోమ : పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికీ న్యాయం చేసే విధంగా కృషి చేయాలని ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను, స్టేషన్ ఆవరణలోని నివాస గృహాలు, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పకడ్బందీగా నాకాబందీ
వికారాబాద్ : జిల్లాలో పకడ్బందీగా నాకాబందీ జరుగుతున్నదని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ నిషేధ గు ట్కా, గంజాయి, రాత్రి సమయంలో దొంగతనాలు, అక్రమ ట్రాన్స్పోర్ట్, పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యక్రమాలపై నాకాబందీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటక నుంచి రెండు కలప లారీలు వస్తుంటే వాటిని పట్టుకొని సీజ్ చేశామని పేర్కొన్నారు. మోమిన్పేట పోలీస్ స్టేషన్లో కాకతీయ కంపెనీ నుంచి 80 కిలోల ఇనుమును దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 933 వాహనాలు తనిఖీ చేశామని, 6 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు.