దోమ : పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేయాలని డీఈవో రేణుకాదేవి అన్నారు. దోమ మండల పరిధిలోని అయినాపూర్, దోమ బాలికల బాలుర ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలను డీఈవో రేణుకాదేవి మంగళవారం సందర్శించి పాఠశాలల వసతులు, కొవిడ్ నిబంధనల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలల్లో కొవిడ్ వ్యాప్తి సమస్య తలెత్తకుండా విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, శానిటైజర్లు తమ వెంట తెచ్చుకోవడమే కాకుండా తరగతి గదిలో తరగతి బయట తప్పనిసరిగా సామాజిక దూరం పాటించే విధంగా విద్యార్థులకు అవగహన కల్పించి విద్యా బోధన జరుపాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఆమె సూచించారు.
ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించే దిశగా చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం.. అందించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఆమె తెలిపారు. అనంతరం ఆమె తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఆయా గ్రామ పంచాయతీలలో పని చేసే పంచాయతీ సిబ్బంది పాఠశాలల పరిశుభ్రతకు సహకరించే విధంగా ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.