యాచారం, ఫిబ్రవరి 2, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి ఉరితాడు బిగించిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. అంజయ్య అన్నారు. మండలంలోని మాల్, నందివనపర్తి గ్రామాల్లో ఉపాధి కూలీలతో కలిసి గురువారం ఆందోళన చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉపాధి కూలీలకు ఇచ్చే ఆహార సబ్సిడీ, రైతులకు ఇచ్చే ఇన్ఫుట్ సబ్సిడీల పైన భారీ కోత విధించిందన్నారు. బడ్జెట్ గ్రామీణ ప్రాంత పేదల నోట్లో మట్టి కొట్టిందన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 100రోజుల పని కల్పనకు రూ.1,85,000కోట్ల బడ్జెట్ అవసరమన్నారు. గత బడ్జెట్లో రూ.89,000 కోట్లు ప్రవేశ పెట్టిన కేంద్ర సర్కారు, ప్రస్తుతం రూ. 60కోట్లు ప్రవేశపెట్టడం సిగ్గు చేటన్నారు. 35రోజులు మాత్రమే పని కల్పించడంతో 15వేల కోట్ల కుటుంబాలు ఉపాధి పనికి దూరమయ్యాయన్నారు. గ్రామాల్లో వేసవి రానుండటంతో ఉపాధి లేక కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను సక్రమంగా చేపట్టాలన్నారు. లేదంటే రానున్న ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, జంగయ్య, ఇందిరమ్మ, అంజయ్య, ఈశ్వరయ్య, జాహంగీర్, మంగమ్మ, ఆండాళు ఉన్నారు.
కేంద్ర బడ్జెట్ పత్రాల దహనం
పరిగి టౌన్, ఫిబ్రవరి 2 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజావ్యతిరేకంగా ఉందని నిరసిస్తూ గురువారం పరిగి బస్టాండు దగ్గర సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని కేవలం బడా వ్యాపారుస్తులకు ప్రయోజనం చేకూరేలా ఉందన్నారు. ఉపాధిహామీ పథకం, వ్యవసాయానికి నిధులు తగ్గించారని గ్రామీణ ప్రాంతాల ప్రజల నోట్లో మట్టికొట్టి బడాబాబులకు మేలు చేకూరేలా బడ్జెట్ ఉందన్నారు. కార్యక్రమంలో హబీబ్, యాదగిరి, సత్యయ్య, రఘురామ్, శేఖర్ పాల్గొన్నారు.