పెద్దఅంబర్పేట, ఫిబ్రవరి 15 : ఉత్తమ ఫలితాలకు ‘ప్రేరణ’ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రేరణ పేరిట గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుశీందర్రావు, గౌరవ అతిథిగా ఇంపాక్ట్ వ్యవస్థాపకుడు గంప నాగేశ్వర్రావు, డీడీఎల్ ట్రస్ట్ చైర్మన్ శరత్బాబు హాజరయ్యారు. విద్యార్థుల కోసం నిపుణులతో ప్రత్యేకంగా రూపొందించిన టీచర్స్ హ్యాండ్బుక్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 1200 మంది విద్యార్థులకు ఉచితంగా హ్యాండ్బుక్లను పంపిణీ చేశారు.
అనంతరం సుశీందర్రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇలాంటి ప్రేరణ కార్యక్రమాలు దోహదం చేస్తాయని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు పరీక్షలకు కేవలం నెల సమయమే ఉన్నందున ఆ టైంను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలి, ఎలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలో గంప నాగేశ్వర్రావు వివరించారు.
విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని ఎలా బయటపెట్టాలో చెప్పారు. అనంతరం వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవోలు వెంకట్రెడ్డి, హీర్యానాయక్, ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి, దశరథ రాంరెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీనివాస్రావు, ప్రభాకర్గౌడ్, చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు కిశోర్, రాంబాబు, శ్రీధర్, సుశీల్, సంతోష్, ప్రసాద్, శాంతారాంప్రసాద్, అభిరాం, అభిషేక్, రాంబాబు పాల్గొన్నారు.