రంగారెడ్డి, జనవరి 1 (నమస్తే తెలంగాణ);ధరణి పోర్టల్తో రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పు వచ్చింది. భూ సమస్యలు శరవేగంగా పరిష్కారమవుతుండడంతో ‘ధరణి’ రైతు బాంధవిగా పేరొందుతున్నది. పారదర్శకంగా సేవలందిస్తూ అన్నదాతల మెప్పు పొందుతున్నది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాసు పుస్తకాల జారీ, వారసత్వ బదిలీలు తదితర పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,89,068 భూ సమస్యలకుగాను ఇప్పటికే 1,73,966 భూ సమస్యలకు పరిష్కారం లభించింది. 15,102 భూ సమస్యలు పెండింగ్లో ఉండగా, త్వరలో వాటినీ పరిష్కరించి భూ సమస్యలు లేని జిల్లాగా మార్చనున్నట్లు కలెక్టర్ అమయ్కుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా భూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ధరణితో భూ సమస్యలు చకచకా పరిష్కారమవుతుండడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. గత పాలకుల హయాంలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు కార్యాల పనులు నెరవేరుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగా మ్యుటేషన్లు శరవేగంగా సాగుతున్నాయి. గత పాలకుల హయాంలో భూ దందాలు అనేకం జరిగి ఎంతో మంది భూ పట్టాదారులు లెక్కలేనన్ని సమస్యల్లో ఇరుక్కుపోయారు. భూ సమస్యలతో తిప్పలు, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన ఎంతో మందికి ‘ధరణి’ పరిష్కారం చూపుతున్నది. హైదరాబాద్ మహా నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా భూ సమస్యలు లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ‘ధరణి’ పోర్టల్తో చెక్ పెట్టింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ విజయవంతంగా కొనసాగుతున్నది. భూ సమస్య ఎంత జఠిలమైనదైనా ఇట్టే పరిష్కరిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలు అనేకం ఉన్నప్పటికీ 97 నుంచి 98 శాతం వరకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించింది. త్వరలోనే భూ సమస్యలు లేని ‘రంగారెడ్డి’ని చూడొచ్చని కలెక్టర్ అమయ్ కుమార్ అంటున్నారు. ధరణిలో సమస్యలు వేగవంతంగా, సులభతరంగా, పారదర్శకంగా లావాదేవీలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రజలు ధరణిపై అవగాహన పెంచుకొని వారి సమస్యల నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో వివిధ రకాల 1,89,068 భూ సమస్యలున్నాయి. వాటిలో 1,73,966 సమస్యలకు ‘ధరణి’ వేదికగా పరిష్కారం లభించింది. 15,102 సమస్యలు పెండింగులో ఉన్నాయి.
రెవెన్యూ వ్యవస్థలో ‘ధరణి’ విప్లవాత్మకం
రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన పలు సమస్యలకు ‘ధరణి’ విప్లవాత్మక మార్పులను తెస్తున్నది. సమస్యల్లో ఇరుక్కుపోయిన ఎంతో మందికి ‘ధరణి’ మేలు చేస్తున్నది. ఇందులో స్లాట్ బుకింగుల నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాసు పుస్తకాలు అందజేయడం మొదలైనవన్నీ చకచకా సాగిపోతాయి. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగే ప్రసక్తి ‘ధరణి’ పోర్టల్లో లేదు. సాంకేతిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడొచ్చు. కాని, పొరపాట్లు జరగడానికి ఆస్కారం లేదు. జిల్లాలో పేరుకుపోయిన 1,89,068 సమస్యలకు ధరణి వేదికపై 1,73,966లకు పరిష్కారం చేశాం. కాగా, పెండింగులో 15,102 మాత్రమే ఉన్నాయి. వీటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తాం. చాలా సులువుగా, అరగంటలో పట్టా పొందేందుకు అస్కారం ‘ధరణి’ ద్వారా సాధ్యం. – అమయ్ కుమార్, రంగారెడ్డి కలెక్టర్