రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ) : మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే.. ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాదీ సూచించారు. రంగారెడ్డి జిల్లా పర్యటనకు మంగళవారం హాజరైన షెహజాదీకి కొంగర కలాన్లోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరీశ్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ స్వాగతం పలికారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలు తీరుపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మైనార్టీల స్థితిగతులు, వారి జనాభా గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరుస్తున్న లబ్ధి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా షెహజాదీ మాట్లాడుతూ.. షాదీముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్హులైనవారికి మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందిస్తున్న ముందస్తు ఉచిత శిక్షణ కేంద్రాల్లో మైనార్టీ యువతులు ఎక్కువ సంఖ్యలో చేరేలా వారి కుటుంబీకులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే మసీదు నిర్వహణ కమిటీల సహకారం తీసుకోవాలని సూచించారు. సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నవారిలో అత్యధికులు ముస్లిం మైనార్టీలే ఉన్నందున వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.
విరివిగా రుణాలు అందజేయాలి
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నందున అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని షెహజాదీ సూచించారు. మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మహిళా శిశు సంక్షేమం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, బ్యాంకింగ్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల ద్వారా మైనార్టీలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రగతి గురించి కమిషన్ సభ్యురాలి దృష్టికి తెచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఉన్నారు.