అబిడ్స్, ఆగస్టు 10 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను ఘనంగా జరుపుకొనేందుకు నగరం సమాయత్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాఖీల తయారీ, అమ్మకాలు గ్రేటర్లో ఊపందుకున్నాయి. ఇప్పటికే రహదారుల వెంట విక్రయ కేంద్రాలు వెలిశాయి. వైవిధ్య రాఖీలకు మంచి ఆదరణ ఉండటంతో ఇప్పటిలాగే ఈసారి కూడా సరికొత్త రాఖీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
రాఖీల తయారీకి..
రాఖీల తయారీకి పేరుగాంచిన ధూల్పేట్, రహీంపురా తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రకరకాల రాఖీలను రూపొందిస్తున్నారు. ఇక్కడి రాఖీలతో పాటు ముంబై, కోల్కత్తా, గుజరాత్ తదితర రాష్ర్టాల నుంచి ఫ్యాన్సీ రాఖీలను వ్యాపారులు దిగుమతి చేసుకొని అమ్మకాలు చేపడుతున్నారు. ధూల్పేట, రహీంపురా ప్రాంతాల్లో తయారైన రాఖీలను కొనుగోలు చేసేందుకు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. రంగు, రంగుల దారాలు, వివిధ రకాల పూసలు, వెండి రాఖీలు, బంగారు పూతతో తయారు చేసిన వివిధ ఆకృతుల రాఖీలకు మంచి డిమాండ్ ఉన్నది. రూపాయి మొదలుకొని వెయ్యి రూపాయల వరకు రాఖీలు అందుబాటులో ఉన్నాయి.
రిటైల్ దుకాణాలు
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో రాఖీలు విక్రయించేందుకు రిటైల్ దుకాణాలు పెద్ద ఎత్తున కొలువుదీరాయి. ఇప్పటికే కోఠి, బేగంబజార్, సిద్దంబర్బజార్, గోషామహల్, నాంపల్లి, మల్లెపల్లి తదితర ప్రాంతాల్లో రాఖీల దుకాణాలపే ఏర్పాటు చేశారు. రకరకాల రాఖీలతో పాటు ఫ్యాన్సీ వాటికి అధికంగా గిరాకీ ఉన్నదని వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రాఖీలను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే బంగారం, వెండితో పాటు అమెరికన్ డైమండ్స్తో రూపొందించిన రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయంటున్నారు.