మొయినాబాద్, ఫిబ్రవరి 3 : తెలంగాణ ప్రభుత్వ శాఖల పనితీరు బాగున్నదని మహారాష్ట్ర జిల్లాస్థాయి అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్ల బృందం కితాబునిచ్చింది. రాజేంద్రనగర్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఏయే శాఖలు ఉన్నాయి, పని తీరు ఎలా ఉన్నది..ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారన్న పలు అంశాలపై శిక్షణ పొందుతున్నారు. వారి శిక్షణలో భాగంగా శనివారం మండల పరిధిలోని చిలుకూరు గ్రామ పంచాయతీని సందర్శించి వివరాలను సేకరించారు. గ్రామ పంచాయతీ ద్వారా ఎలాంటి సేవలు ప్రజలకు అందిస్తున్నారనే అంశాలను గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో సంధ్య, గ్రామ కార్యదర్శి వెంకటేశ్ను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు, ప్రభుత్వ నిధులపై ఆరా తీశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల వారీగా ఆ శాఖలు ఎలాంటి నిధులు ఖర్చు చేస్తున్నారు, ఆ శాఖ మండల స్థాయి అధికారులు ఎలాంటి సేవలు చేస్తారనే పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో మండల స్థాయిలో ఎలాంటి పనులు చేస్తుంది, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ఎలాంటి విధులు నిర్వహిస్తారనే అంశాలను ఎంపీడీవో సంధ్య తెలిపారు.
మండల పరిషత్కు అధ్యక్షురాలు ఉంటారని, వారు ఆధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయడం జరుగుతున్నదని ఎంపీడీవో తెలిపారు. మండలంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో మండల విద్యాధికారి వెంకటయ్య చెప్పారు. గ్రామ పంచాయతీలు ఎలాంటి పనులు చేస్తున్నది, నిధులు ఎలా ఖర్చు పెడుతారు.. తదితర విషయాలను ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి వివరించారు.
రెవెన్యూ శాఖ ద్వారా భూముల క్రయ విక్రయాలు, వాటి అమలు తీరును డీటీ వినోద్ తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామంలో అంతర్గత మురుగు కాలువలు, సీసీ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణ పనులు చేయిస్తామని పీఆర్ ఏఈ రమ్య పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖల విధివిధానాలు, ఆయా శాఖల అధికారులు చేస్తున్న పనులను వివరించడంతో మహారాష్ట్ర అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వారితో పాటు సీఈవో ఉమారాణి, మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, ఏపీఎం రవీందర్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.