దసరావ్ పండుగ సంబురాలు లంబాడీల ఇంటింటా జరుగనున్నాయి. రెండేండ్లకు ఒకసారి వచ్చే ఈ పండుగ.. వారి సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. లంబాడీల ఆరాధ్య దైవమైన తుల్జాభవానీ మాతను భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఏటా కార్తిక పౌర్ణమి తరువాత వచ్చే మొదటి మంగళవారం నుంచి 45 రోజులపాటు పండుగ కొనసాగుతుంది. వానకాలం పంటలు చేతికొచ్చే వేళ గిరిజనులు చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో సంబురాలు చేసుకుంటారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని పలు తండాల్లో దసరావ్ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి.
– బొంరాస్పేట, డిసెంబర్ 17
బొంరాస్పేట, డిసెంబర్ 17 : భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో మతానికి, ఒక్కో కులానికి, జాతులకు ప్రత్యేకించి పండుగలు ఉన్నాయి. కొన్ని పండుగలు యావత్ దేశం అంతటా జరుపుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నాయి. మరికొన్ని పండుగలను వారి వారి ప్రాంతాలు, జాతులను బట్టి పండుగల పేర్లు మారుతుంటాయి. తెలంగాణలో అత్యధికంగా నివసించే గిరిజన తెగకు చెందిన లంబాడీలు జరుపుకునే దసరావ్ పండుగలు వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
లంబాడీల ఆరాధ్య దైవమైన తుల్జాభవానీ మాతను కొలుస్తూ ప్రతి రెండేళ్లకోసారి దసరావ్ పండుగలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలను జరుపుకోవడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే మొదటి మంగళవారం నుంచి 45 రోజులపాటు నవంబర్, డిసెంబర్ నెలల్లో వారు ఈ పండుగలను జరుపుకుంటారు. పట్టణ నాగరికతకు దూరంగా ఉంటూ ఏడాది పొడవునా కాయకష్టం చేసుకుని బతికే లంబాడీలకు దసరావ్ పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటా సంబురమే. చిన్నా పెద్దా, ఆడా మగా ఆనందోత్సాహాలతో పండుగ సంబురాల్లో మునిగి తేలుతారు. మండలంలోని వివిధ తండాల్లో కొన్ని రోజుల నుంచి దసరావ్ పండుగ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు.
వానకాలం పంటలు చేతికొచ్చే వేళ గిరిజనులు జరుపుకునే దసరావ్ పండుగపై నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం. వికారాబాద్ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బొంరాస్పేట, కులకచర్ల మండలాల్లో తండాల సంఖ్య ఎక్కువ. ఈ తండాలలో నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇంటిపైన ఎర్ర జెండాలు, ఏ ఇంటిని చూసినా విద్యుత్ దీపాలతో అలంకరించిన దృశ్యాలు, ప్రతి ఇంటా పండుగ వాతావరణం కొట్టొచ్చిన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రతి రెండేళ్లకోసారి లంబాడీలు తమ కుల దైవమైన తుల్జా భవానీ మాతకు పూజలు చేస్తూ దసరావ్ పండుగను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు. గిరిజనులకు ఇదే పెద్ద పండుగ. తరతరాల నుంచి వచ్చే సంప్రదాయాన్ని గిరిజనులు నేటికీ కొనసాగిస్తున్నారు.
ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే మొదటి మంగళవారం నుంచి పండుగ ప్రారంభమవుతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో దసరావ్ పండుగలను జరుపుకుంటారు. ఒక తండాలో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలు ఒకే రోజు పండుగ జరుపుకోవడం వీరి ప్రత్యేకత. మొదట తమ ఇండ్లకు సున్నం, రంగులు వేసి శుభ్రం చేసుకుంటారు. కొందరు దసరావ్ పండుగకు ముందు పీర్లకు కందుర్లు కూడా చేస్తారు. ఆ తరువాత తండాలోని ప్రతి కుటుంబంలో ఒకరో లేక ఇద్దరు కలిసి ఇంట్లో వెండితో తయారు చేసిన తుల్జాభవానీమాత విగ్రహాన్ని తీసుకుని మహారాష్ట్రలోని తుల్జాపూర్కు వెళ్తారు. అక్కడ తుల్జాభవానీ మాత దేవాలయంలో మేక పోతులను బలిచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకుంటారు.
అక్కడి పూజారులు లంబాడీలకు గవ్వల దండ వేసి ఎర్రటి వస్ర్తాన్ని కప్పి పంపిస్తారు. తుల్జాపూర్ నుంచి లంబాడీలు అక్కడి పూజారులు వేసిన గవ్వల దండను మెడలో వేసుకుని చేతిలో కాషాయం రంగు జెండాపట్టుకుని బయలుదేరి తండాకు చేరుకుంటారు. దసరావ్ పండుగ మంగళవారం మాత్రమే చేస్తారు కాబట్టి శనివారం తుల్జాపూర్కు వెళ్లి మంగళవారం ఉదయం నాటికి తండాకు చేరుకునేలా ప్రణాళిక వేసుకుంటారు. తుల్జాపూర్ నుంచి వచ్చే వరకు ప్రతి ఇంట్లో అమ్మవారిని ప్రతిష్టించటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. బియ్యం, జొన్నలు తదితర ఐదు రకాల ధాన్యం బస్తాలతో ఇండ్ల ముందు మండపాలను ఏర్పాటు చేసి దానిపై కొత్త ఎర్రటి వస్ర్తాన్ని కప్పుతారు. మండపం ముందు అమ్మవారిని ప్రతిష్ఠించటానికి బియ్యం పోస్తారు.
మండపాన్ని బంతి తదితర పూలతో, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. తుల్జాపూర్ నుంచి వచ్చిన వారు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందే కూర్చుంటారు. పురోహితులతో అమ్మవారి విగ్రహానికి పంచామృతంతో అభిషేకించిన తరువాత కుటుంబ సభ్యులు పాటలు పాడుకుంటూ తుల్జభవానీ మాతను ఒక పాత్రలో ఉంచి తలపై పెట్టుకుని తెచ్చి మండపంలో ప్రతిష్టిస్తారు. అనంతరం అమ్మవారికి తీపి వంటకాలు వండి నైవేద్యం సమర్పిస్తారు. పలు రకాల పండ్లను కూడా నైవేద్యంగా పెడతారు. సాయంత్రం మేకపోతులను బలిచ్చి అమ్మవారి ముందు ఉంచుతారు. మాంసం వండి కుంభం పోసి నైవేద్యంగా సమర్పిస్తారు. మంగళవారం రాత్రి వచ్చిన బంధువులు, మిత్రులు, అతిథులకు మాంసాహారంతో భోజనం పెడతారు.
రాత్రంతా అమ్మవారి మండపం ముందు పాటలు పాడుతూ భజనలు చేస్తారు. కుటుంబ సభ్యులు రాత్రి భోజనాలు చేసిన తరువాత ఆనందంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గడుపుతారు. రాత్రంతా జాగారం చేస్తారు. బుధవారం ఉదయం మళ్లీ అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు ముగిస్తారు. తుల్జాభవానీ పూజచేసే మంగళవారం ముందు సోమవారం రోజు ఆంజనేయస్వామిని కూడా గిరిజనులు పూజిస్తారు. స్వామి చిత్రపటాలను ఉంచి మాలిజను నైవేద్యంగా సమర్పిస్తారు. తండాల్లో పశువులు, మేకలు, గొర్రెలు ఏడాదంతా మంచిగా ఉండాలని మంగళవారం ఉదయం మంత్రాల్ పూజను నిర్వహిస్తారు.
ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎవరైనా విడిపోయి కొత్తగా సంసారం పెడితే వారు వరుసగా మూడేండ్లు దసరా పండుగ చేయడం లంబాడీల్లో ఆచారం . ఆ తరువాత అందరిలా రెండేండ్లకోసారి చేయాలి. దసరావ్ పండుగ చేయడానికి ఒక్కో కుటుంబానికి రూ.50 నుంచి రూ.70 వేల దాకా ఖర్చు వస్తుంది. ఒక్కో కుటుంబంలో మొక్కును బట్టి మూడు నుంచి ఐదు మేకపోతుల దాకా కోస్తారు. రెండేండ్లకోసారి చేస్తారు కాబట్టి బంధువులతో లంబాడీల ఇండ్లు కళకళలాడుతుంటాయి. బతుకు దెరువుకోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారంతా పండుగలకు వచ్చి కలుసుకుని ఆనందంగా గడుపుతారు. తమ ఆరాధ్య దైవం తుల్జాభవానీ మాతకు మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని లంబాడీలకు ప్రగాఢ విశ్వాసం.