సుగంధ ద్రవ్యాల సాగు లాభదాయకం.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.. వోమ, తులసి, ధనియాలు, జిలకర, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, పుదీన, మెంతులు, ఆరోమాటిక్ లెమన్ గ్రాస్ తదితర పంటలను సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారులు సలహాలు, సూచనలను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ పంటలు సాగు చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను సైతం అందిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 1475 ఎకరాలకు పైగా సుగంధ ద్రవ్యాల సాగు చేయగా, 4,280 మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో తక్కువ పెట్టుబడితో సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తుండడంతో సుగంధ ద్రవ్యాల సాగు వైపు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
– రంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, కూరగాయలు, పూల సాగుకు పెట్టింది పేరు. హైదరాబాద్ మహా నగరాన్ని ఆవరించి ఉన్న జిల్లాలో వీటిన్నింటితోపాటు సుగంధ ద్రవ్యాల సాగు కూడా లాభదాయకంగా కొనసాగుతున్నది. సాగు కొద్దిమేరకే జరిగినప్పటికీ, దిగుబడి స్వల్పంగానే వచ్చినప్పటికీ మార్కెట్లో వాటి ధరలు మాత్రం పెద్ద మొత్తంలో ఉండి, రైతులకు లాభాలను చేకూర్చుతున్నాయి. సంప్రదాయ పంటలే కాకుండా ఇక్కడి రైతులు వినూత్నంగా ఆరు తడి పంటలను వేస్తున్నారు.
పంటల సాగులోనూ వైవిద్యాన్ని చూపుతూ, ఏ పంటలు వేస్తే మార్కెట్లో లాభదాయకంగా నిలబడొచ్చో.. అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో అన్నదాతలు పండించే సుగంధ ద్రవ్యాల సాగుకు వినియోగదారుల నుంచి నిత్యం ఆదరణ, మార్కెట్ల నుంచి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. జన బాహుళ్యంలో వీటి వినియోగం అధికంగా ఉంది. నేడు ప్రతి వంటకానికి, రుచికి, సుచికి ఈ సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తూనే ఉన్నారు. తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టి ఎక్కువ దిగుబడిని తీస్తూ జిల్లా రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ సుగంధ ద్రవ్యాల సాగు నిమిత్తం జిల్లా ఉద్యాన వన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు పురోగమనం దిశగా అడుగులు వేస్తున్నారు. సుగంధ ద్రవ్యాల సాగులో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాయితీలను అందిపుచ్చుకుంటూ వివిధ రకాల పంటల్లో పెద్ద ఎత్తున దిగుబడి తెస్తున్నారు.
లాభసాటిగా సాగు..
రంగారెడ్డి జిల్లాలో వానకాలంలో 885 ఎకరాలు, యాసంగిలో 590 ఎకరాలు.. మొత్తంగా 1475 ఎకరాలకు పైగా సుగంధ ద్రవ్యాల సాగు కొనసాగుతున్నది. సుగంధ ద్రవ్యాల్లో ‘ఓమ, తులసి, ధనియాలు, జిలకర, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, పుదీన, మెంతులు, మిర్చి, ఆరోమాటిక్ లెమన్ గ్రాస్’ లాంటివి అనేకం ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యాల పంటలకు హైదరాబాద్ నగరమే అతి పెద్ద మార్కెట్. నగరంలోని ప్రతి మార్కెట్ సుగంధ ద్రవ్యాల అమ్మకానికి దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటికి మార్కెట్ అధికంగా ఉంటుంది. ప్రతి ఆహార పదార్థంలోనూ వీటి అమరిక లేనిది రుచి రాదంటే అతిశయోక్తి కాదు. దిగుబడి కొద్దిమేరకు వచ్చినా వాటి ధర అమితంగా ఉంటుంది. అందుకే వీటి సాగు లాభసాటిగా ఉందని రైతులు చెబుతున్నారు.
సుగంధ ద్రవ్యాల సాగు లాభదాయకమే..- సునందారాణి, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి
మిగతా పంటల మాదిరిగా కాకుండా సుగంధ ద్రవ్యాల సాగు రైతుల పాలిట లాభదాయకంగా ఉంటుంది. ప్రతి ఇంటా వీటి అవసరం ఉంటుంది కాబట్టి, వీటిని మినహాయించే ప్రసక్తే ఉండదు. అందుకే వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. రైతులు వీటికి ఎక్కువ మోతాదులో నీళ్లు అందించాల్సిన పని లేదు. ఆరుతడి పంటగా మంచి దిగుబడి సాధించొచ్చు. ఈ పంటల నుంచి దిగుబడి అధికంగా తేనప్పటికీ లాభాలు తేవొచ్చు. లాభాలు గడించాలంటే ప్రతి రైతు సాగు కాలంలో అధికారులు, నిఫుణులు నిర్దేశించిన ప్రకారం ఎరువులను, నీటిని వినియోగించాలి. ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి. ఏమైనా సందేహాలుంటే, మా వద్దకు వచ్చి లేదా గ్రూపుల్లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
మిర్చి లాభదాయకమైన పంట- నర్సింహ, రైతు, నల్లచెరువు
నేను రెండెకరాలు మిర్చి పంట వేశాను. లక్షన్నర పెట్టుబడి పెట్టాను. లాభం మూడు లక్షలకు పైగా వస్తుందని ఆశిస్తున్నాను. పంట సాగు ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. మిర్చి సాగులో లాభమే కాని, నష్టం ఏమాత్రం లేదు. వీటితోపాటు మెంతులు, పుదీన, ధనియాలు కూడా సాగు చేస్తున్నం. నిత్యం ఖర్చులకు సరిపడా డబ్బులొస్తున్నాయి.
లాభాలే తప్ప నష్టం ఉండదు- వెంకటయ్యగౌడ్, బ్రాహ్మణపల్లి
మూడెకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తున్నాను. పెట్టుబడి దాదాపు రెండు లక్షల మేర పెడుతున్నాను. 60 క్వింటాళ్ల మిరప పంట పండుతుందని స్థానికులు, అధికారులు చెబుతున్నారు. రూ.5లక్షలకు మించి లాభం వస్తున్నదని అనుకుంటున్న. సంప్రదాయ పంటల సాగు చేస్తే వచ్చినట్టుగా నష్టం రాదు. మిర్చి పంట వేస్తే లాభాలే తప్ప నష్టం అసలే ఉండదు. వీటిలో ఆయా గ్రేడులను బట్టి ధరలు పలుకుతాయి. మంచి గ్రేడ్కు ధర అధికంగా ఉంటుంది.
4,280 మెట్రిక్ టన్నుల దిగుబడి
సంప్రదాయ పంటల సాగును మించిన దిగుబడి రానప్పటికీ మార్కెట్లో వీటి ధరలు ఏ మేరకు ఉంటాయో తెలియనిది కాదు. వానకాలంలోనే ఎక్కువ విస్తీర్ణంలో, యాసంగి సీజన్లో సాగు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నది. ఏడాది మొత్తం మీద వీటి సాగుతో 4,280 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నది. జిల్లాలో మిర్చి-700 ఎకరాలు, పుదీన-250, ఓమ-180, చింతపండు-40, తులసి-19, గోరింటాకు-30, మెంతులు-14, ధనియాలు-262, ఆరోమాటిక్ లెమన్ గ్రాస్-20 ఎకరాల్లో సాగు కొనసాగుతున్నది.
ఈ పంటలను చేవెళ్ల, శంకర్పల్లి, షాద్నగర్, మాడ్గుల, ఫరూఖ్నగర్, షాబాద్, మంచాల, మొయినాబాద్, తోల్కట్ట, ఆమన్గల్లలో పండిస్తున్నారు. పచ్చి మిర్చి, ఎండు మిర్చి ధరలు ఓపెన్ మార్కెట్లో వివిధ గ్రేడుల్లో రూ.140 నుంచి రూ.400 పైనే ఉంటుంది. పుదీన వివిధ గ్రేడుల్లో రూ.180 నుంచి రూ.275 వరకు ప్యాక్గా లభిస్తున్నది. వివిధ మార్కెట్లను బట్టి వాటి తాజాదనాన్ని బట్టి వాటి ధరలు ఆ కోవలోనే కొనసాగుతున్నాయి. మిగతా సుగంధ ద్రవ్యాలను కేజీలు, క్వింటాల్లలో కొనలేము. వాటి ధరలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.