పెద్దేముల్ : జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల కోసం, సామాన్య ప్రజల కోసం కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం మండల పరిధిలోని మంబాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డా. తుకారం భట్తో కలిసి పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి విద్యార్థితో పాటు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొని ప్రతి ఒక్కరూ కూడా కరోనాను నిర్మూలించడంలో భాగంగా కొవిడ్ టీకాలను వేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు జనవరి 25, 27 తేదీల్లో విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ వేయించడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. అంతకుముందు మంబాపూర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో పెద్దేముల్ ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డా. రాకేష్ను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇంటింటికీ కొనసాగుతున్న ఫీవర్ సర్వే, ఐసొలేషన్ కిట్ల పంపిణీకి సంబంధించి వేరు వేరు రిజిష్టర్లలో వివరాలు నమోదు చేస్తున్నారా?లేదా? ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేసిన తరువాత వారిని ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నారా? లేదా? ఇప్పటి వరకు మండలంలో ఎంతశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు? స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎంతమంది విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చారు? సిబ్బంది పనితీరు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.
అందుకు డా. రాకేశ్ బదులిస్తూ గొట్లపల్లి మోడల్ స్కూల్లో 110 మంది విద్యార్థులకు గాను 70మంది విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, ప్రస్తుతం మంబాపూర్లో కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఓ విద్యార్థికి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేస్తున్న తీరును డీఎంహెచ్ఓతో కలిసి పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు సలహాలను అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యాలాటి శ్రీనివాస్, డా,రాకేశ్, హెల్త్ సూపర్ వైజర్ పుష్పలత, ఆర్ఐ రాజురెడ్డి, ఇతర వైద్య సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.