బండ్లగూడ, మే 3: ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి (38) మృతి చెందగా భర్త రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాబాదుకు చెందిన రమేశ్ చిన్ననాటి నుంచి బాలానగర్ లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఇతడు వెంకటేశ్వర వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు పూర్తిగా దివాలా తీశారు. భార్య రాజేశ్వరి మతిస్థిమితం కోల్పోయి పిచ్చి ఆసుపత్రిలో చేరింది.
అనంతరం ఆమె ఆరోగ్యం కుదుటపడింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి మియాపూర్ లో ఉంటున్న రమేశ్ సోదరి ఎర్రబోడలో ఉన్న ఆమె ఇంటిలో ఆశ్రయం ఇచ్చింది. రెండు నెలల కు సరిపడా రేషన్ సమకూర్చి మంచిగా ఉండాలని సూచించింది. కాగా ఏప్రిల్ 30వ తేదీ రాత్రి రమేశ్, రాజేశ్వరి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అప్పటికే రాజేశ్వరి మృతి చెందగా రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.