పరిగి, డిసెంబర్ 3 : వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికెళ్లి టీకా పంపిణీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకునేలా చూడాలన్నారు. వ్యాక్సినేషన్పై వికారాబాద్లోని అంబేద్కర్భవన్లో శుక్రవారం మంత్రి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైతే ఒక ఇంటికి పదిసార్లయినా వెళ్లి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయించే బాధ్యత వార్డు కౌన్సిలర్లదేనన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ వార్తల నేపథ్యంలో టీకా పంపిణీని వేగవంతం చేయాలన్నారు. వ్యాక్సిన్పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. వందశాతం పూర్తి చేసేవరకు విశ్రమించకూడదన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో 80 లక్షల వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు గురుకులాలు సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. సమావేశం అనంతరం మంత్రి సబితారెడ్డి స్వయంగా ఇంటింటికీ తిరిగి టీకా వేయించారు.
ప్రతి వార్డులో వందశాతం వ్యాక్సినేషన్ చేయించే బాధ్యత సంబంధిత వార్డు కౌన్సిలర్లదేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్లోని అంబేద్కర్భవన్లో శుక్రవారం మంత్రి సబితారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికెళ్లి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ బాధ్యతను ఆయా వార్డుల కౌన్సిలర్లు తీసుకోవాలని మంత్రి చెప్పారు. వైద్య సిబ్బంది, ఇతర అధికారులు, వార్డు కౌన్సిలర్లకు బాధ్యతలు అప్పగించాలన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందడానికి రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించాల్సిందిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 80లక్షలు వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు గురుకులాలు సందర్శించాలని, అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలని మంత్రి సూచించారు. వలస వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు ప్రతి గ్రామం, పట్టణంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని మంత్రి ఆదేశించారు. ముందుగా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకొని ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో కొవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఇంటింటి సర్వే జరిపి వ్యాక్సిన్ వేయించుకోని వారందరికీ టీకా వేయాలన్నారు. రెండో డోసు వేసేందుకు మరిన్ని కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ గ్రామా ల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడలో పలు ఇండ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారా అని మంత్రి సబితారెడ్డి అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని ఓ వ్యక్తికి దగ్గరుండి వ్యాక్సిన్ వేయించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, తాండూరు ఆర్డీవో అశోక్కుమార్, వికారాబాద్, పరిగి, తాండూరు మున్సిపల్ చైర్మన్లు మంజుల, ముకుంద అశోక్, స్వప్న, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.