విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బెల్లం రాగిజావ, బెల్లం పట్టీలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కొన్ని స్కూళ్లలో రాగిజావ పంపిణీ చేస్తుండగా.. త్వరలో అన్ని బడుల్లో అమలుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నెలకు సరిపడా 10,050 కిలోల బెల్లం పౌడర్, 10,050 కిలోల రాగి పిండి జిల్లాకు చేరుకున్నది. ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పౌడర్ కలిపి జావగా ఇస్తారు. త్వరలో మధ్యాహ్న భోజన కార్మికులకు చీరలను కానుకగా ఇవ్వనున్నారు.
బొంరాస్పేట, ఆగస్టు 10 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటికే పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనం రూపంలో ప్రభుత్వం అందజేస్తున్నది. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి వెజిటబుల్ బిర్యానీని చేర్చింది ప్రభుత్వం. విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావను అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రాగిరావ పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న వంట ఏజెన్సీల ద్వారానే దీనిని కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాగిజావ పంపిణీతో విద్యార్థులకు మరింత పోషకాహారం అందుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు బెల్లం పట్టీల పంపిణీకి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులకు రాష్ట్ర సర్కార్ చీరలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని కూడా త్వరలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రాగిజావ, బెల్లం ప్యాకెట్లు సరఫరా
జిల్లాలోని 1074 ప్రభుత్వ పాఠశాలల్లో 90,897 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రాగిజావ పంపిణీ చేయడానికి ప్రభుత్వం నెలకు కావలసిన 10,050 కిలోల బెల్లం పౌడర్, 10,050 కిలోల రాగిపౌడర్ను వికారాబాద్ జిల్లాకు సరఫరా చేసింది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని మండలాలకు సరఫరా చేశారు. ఎంఆర్సీ కార్యాలయాల నుంచి పాఠశాలల హెచ్ఎంలు వీటిని తీసుకెళ్లి వెంటనే రాగిజావ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి రోజు 10 గ్రాముల రాగి పౌడర్, 10 గ్రాముల బెల్లం కలిపి జావగా తయారు చేసి అందించాలి. వారంలో మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారం ఇలా నెలలో 11 రోజులు రాగిజావ పంపిణీ చేస్తారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో 11 రోజులు విద్యార్థులకు గుడ్లు అందజేస్తున్నారు.
త్వరలో బెల్లం పట్టీలు కూడా పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం త్వరలో బెల్లం పట్టీలు కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 14వ తేదీన మంత్రి సబితా ఇంద్రారెడ్డి బెల్లం పట్టీల పంపిణీని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వికారాబాద్ జిల్లాలో 1074 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులుగా పని చేస్తున్న 1957 మంది మహిళలకు అందజేయడానికి 1960 చీరలు జిల్లాకు వచ్చాయి.
అన్ని పాఠశాలలకు చేరవేశాం
రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభించాం. ఈ నెల నుంచే అన్ని పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నాం. రాగిజావ తయారు చేయడానికి కావలసిన రాగి పౌడర్, బెల్లం ప్యాకెట్లు మండలాలకు చేరవేశాం. అదేవిధంగా బెల్లం పట్టీలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చీరలు కూడా వచ్చాయి. ఈ రెండింటిని ఈ నెల 14వ తేదీన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తాం.
– రేణుకాదేవి, డీఈవో వికారాబాద్