నాడు సమైక్య పాలకుల హయాంలో పల్లెలు కనీస వసతులకు నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాగునీటి కొరత, గుంతల రోడ్లు, వీధుల్లో మురుగు వంటి సమస్యలతో నిత్యం నరకయాతనపడేవారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ సుపరిపాలనలో పల్లెలు సకల సౌకర్యాలు, పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రత్యేక నిధులతో ఊరూరా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, కంపోస్టు షెడ్డులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామానికో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను సమకూర్చడంతో నిత్యం చెత్త సేకరణ, మొక్కలకు నీటి సరఫరా చేస్తున్నారు. గత తొమ్మిదేండ్లలో వికారాబాద్ జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.700 కోట్లను వెచ్చించింది. జిల్లాలోని 29 గ్రామ పంచాయతీలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు దక్కించుకున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.657 కోట్లను ఖర్చు చేసింది.
-షాబాద్, జూన్ 14
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్, జూన్ 14, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత తొమ్మిదేండ్లుగా కనీవినీ ఎరుగనిరీతిలో పల్లెలు అభివృద్ధి చెందాయి. ప్రధానంగా పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ పంచాయతీల్లో సమూల మార్పులు వచ్చాయి. పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధితో జాతీయ స్థాయి అవార్డులు కూడా దక్కాయి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో రూపుదిద్దుకున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పచ్చదనం దర్శనమిస్తున్నది. పారిశుద్ధ్య నిర్వహణతోపాటు రోడ్లన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ప్రతీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తడి-పొడి చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
మృతి చెందినవారి దహన సంస్కారాలను నిర్వహించేందుకు ప్రతీ పల్లెలో వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక వాకింగ్ ట్రాక్, వివిధ రకాల మొక్కలతో కూడిన పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. పంచాయతీలకు సొంత భవనాలనూ నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా, మరికొన్ని భవనాల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ‘పల్లెప్రగతి’లో భాగంగా గ్రామాల్లో సర్కార్ తుమ్మ, జిల్లెడు వంటి కలుపు మొక్కలు, పెంట కుప్పలను తొలగించడం, రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి పనులతో గ్రామాల్లో సీజనల్ వ్యాధులను నియంత్రించినైట్లెంది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలకు ‘పల్లెప్రగతి’తోపాటు ఎస్ఎఫ్సీ తదితరాల ద్వారా నెలకు దాదాపు రూ.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.
గ్రామాలాభివృద్ధికి రూ.700 కోట్లు..
జిల్లాలోని గ్రామ పంచాయతీల రూపురేఖలు పూర్తిగా మారాయి. గతంలో అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలు ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మండలాల నుంచి గ్రామ పంచాయతీలకు రోడ్లు, సీసీ రోడ్లను నిర్మించారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థను అన్ని గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్ల నిధులిచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 30 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.32 కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.23.12 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.89.05 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.128.22 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.114.22 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.277.72 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి ప్రతీ నెలా రూ.18 కోట్ల చొప్పున జిల్లాకు నిధులిస్తున్నది. దీంతో ప్రతి పంచాయతీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, గతంలోని మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లనూ నిర్మించారు.
గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన మరమ్మతు పనులనూ పూర్తి చేశారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ మంజూరు చేయడం, కరెంట్ ఛార్జీలు, ట్రాక్టర్ల లోన్ చెల్లించడం, పారిశుధ్య పనులకు సంబంధించి అధిక మొత్తంలో పల్లెప్రగతి కింద నిధులను వినియోగించారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలతోపాటు 307 హాబిటేషన్లలో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో ఎకరా స్థలంలో 4 వేల మొక్కలతో ప్రకృతివనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో మొక్కలు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటుకుగాను ప్రభుత్వం రూ.9 లక్షలను ఖర్చు చేసింది. ప్రతీ గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ నుంచి ప్రకృతి వనాలకు ఖర్చు చేశారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్లతోపాటు ట్రాలీ, ట్యాంకర్లనూ అందజేశారు. నిత్యం ట్రాక్టర్తో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం, హరితహారం మొక్కలకు నీరు పోయడం వంటి పనులు చేస్తున్నారు. ట్రాక్టర్ల లోన్ డబ్బులనూ పల్లెప్రగతి నిధుల ద్వారానే చెల్లిస్తున్నారు.
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో కంపోస్ట్ షెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో కంపోస్ట్ షెడ్ నిర్మాణానికిగాను రూ.6 లక్షలను ఖర్చు చేయగా, కంపోస్ట్ షెడ్లో తడి-పొడి చెత్తను వేరుగా నిల్వ చేస్తూ ఎరువులు తయారయ్యే ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలో వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. విద్యుత్తు సమస్యలను పరిష్కారంలో భాగంగా వేలాడుతున్న వైర్లను బాగుచేయడం, విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయడం వంటి పనులు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల్లోనే ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరణ, జనన ధ్రువీకరణ పత్రాలను గ్రామపంచాయతీల్లోనే జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవెన్యూ ప్లాంటేషన్, తెలంగాణ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులకుగాను జిల్లాలోని 29 గ్రామ పంచాయతీలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు దక్కించుకున్నాయి.
ప్రగతి పథంలో రంగారెడ్డి జిల్లా..
షాషాబాద్, జూన్ 14 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. గతంలో రోడ్లపై చెత్త, మురుగుకాల్వల్లో పారుతున్న మురికినీరు, ఎవరైనా చనిపోతే దహనం చేసేందుకు వైకుంఠధామాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పల్లెను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కంపోస్ట్యార్డు, హరితహారం నర్సరీ, పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, రైతువేదిక, తెలంగాణ క్రీడా ప్రాంగణం, చెత్త సేకరణకు ట్రాక్టర్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.657 కోట్ల నిధులు పల్లె ప్రగతి కోసం ఖర్చు చేసింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 558 గ్రామపంచాయతీల్లో పల్లెప్రగతిలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించే పల్లెప్రగతి దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తమ సర్పంచులు, ఎంపీపీలకు సన్మానాలు చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లాకు.. రూ. 657 కోట్లు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఉన్న 558 గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం పల్లెప్రగతి పనులు పూర్తి చేసింది. 2019 సంవత్సరం నుంచి 2023 వరకు ఐదు విడుతల్లో పల్లెప్రగతి కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 657 కోట్ల నిధులు విడుదల చేసింది. జిల్లాకు ఇప్పటివరకు 14, 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.397.72 కోట్లు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.259.51 కోట్లను పనులకు వినియోగించారు. గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం తదితర పనులు చేపట్టి పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించింది. ప్రతి గ్రామంలో కంపోస్ట్యార్డు ఉండడంతో గ్రామ పంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్తో జీపీ సిబ్బంది ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరించి ట్రాక్టర్లో కంపోస్ట్యార్డుకు తరలిస్తున్నారు. ఎవరైనా చనిపోతే వైకుంఠధామంలో దహనం చేస్తున్నారు. పల్లెప్రకృతివనంలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. హరితహారం నర్సరీల్లో పెంచిన మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటి, నీరు పోసి సంరక్షిస్తున్నారు. క్రీడా ప్రాంగణాలు యువతకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పల్లెప్రగతిలో చేపట్టిన అన్ని పనులు పూర్తి కావడంతో ప్రజలకు, రైతులకు అందుబాటులో రావడంతో ఎంతో ఉపయోగపడుతున్నాయి.
బంగారు తెలంగాణే లక్ష్యం..
14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. పల్లెలన్నీ ప్రగతి పథంలో నడిపించేలా పనులు చేపట్టడం సంతోషకరం. పల్లెప్రగతి వచ్చిన తర్వాత గ్రామాలకు మహర్దశ వచ్చింది. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా నిత్యం శుభ్రం చేస్తున్నారు. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం సంతోషకరం.
– సయ్యద్ ఇబ్రహీం, షాబాద్
ఐదు విడుతల్లో పనులు చేపట్టాం..
పల్లెప్రగతి ప్రారంభం నుంచి ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 558 గ్రామ పంచాయతీల్లో ఐదు విడుతల్లో పల్లెప్రగతి పనులు చేపట్టాం. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.657 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పల్లెప్రగతి దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నాం.
– శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డిజిల్లా పంచాయతీ అధికారి
పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం..
గ్రామాలను స్వచ్ఛతగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. గతంలో గ్రామాల్లో ఎక్కడి మురికి అక్కడే పారేది. వైకుంఠధామం, కంపోస్ట్యార్డు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇంటింటికీ వెళ్లి ట్రాక్టర్తో నిత్యం చెత్తను సేకరిస్తున్నారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయి.
– బడుగు మల్లేశ్, హైతాబాద్(షాబాద్)
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామం పరిశుభ్రంగా మారింది. కంపోస్ట్యార్డు, వైకుంఠధామం, హరితహారం నర్సరీ, పల్లెప్రకృతివనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మాణాలు పూర్తై అందుబాటులోకి వచ్చాయి. చెత్త సేకరణకు ట్రాక్టర్ ఏర్పాటు చేశాం. కాలనీల్లో, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరు పోయిస్తున్నాం. డ్రైనేజీలు ఏర్పాటు చేయడంతో సమస్య లేకుండా పోయింది.
– పి.కేతనారమేశ్యాదవ్, సర్పంచ్ కుమ్మరిగూడ(షాబాద్)
పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదం..
గ్రామంలో పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అందులో వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. పండ్లతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. హరితహారం మొక్కలకు నీరుపోసి సంరక్షిస్తున్నారు. గ్రామాలన్నీ పల్లెప్రగతితో కొత్త రూపు సంతరించుకున్నాయి.
– కొలన్ శ్రీకాంత్రెడ్డి, చందనవెళ్లి(షాబాద్)