రంగారెడ్డి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని కందుకూరు మండలం రాచలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు – మన బడి’ ప్రత్యేక కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన మౌలిక వసతులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్లతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో 26 వేల పాఠశాలలకు అధునాతన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నారన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో మొదటి విడుతలో 9 వేల పాఠశాలలను ఎంపిక చేశామని, అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 464 పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించినదని మంత్రి అన్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొదటగా.. రాచలూరులో వసతుల కల్పన
జిల్లాలో మొదటగా రాచలూరు గ్రామంలో ప్రారంభించడం జరిగిందని, పిల్లలు అందరు పాఠశాలకు వచ్చి బాగా చదువుకోవాలని అభిలషించారు. రాష్ట్రంలో ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాన్ని చేపట్టినదన్నారు. విద్యతో పాటు మంచి భోజనాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7,200కోట్లను మంజూరు చేసిందన్నారు. పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. డ్యూయల్ డెస్క్ బెంచీలు, గ్రీన్ బోర్డులు, విద్యుదీకరణ, టాయిలెట్స్ నిర్మాణం, కిచెన్ గదుల నిర్మాణం, తాగునీటి ట్యాంకుల నిర్మాణం వంటి సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. సామాన్య, మధ్య తరగతి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పాఠశాలకు హాజరై విద్యా బోధన కొనసాగించాలని సూచించారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ఈ విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి, టీచర్లకు శిక్షణ ఇచ్చి బోధన చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. జిల్లాలోని మిగతా పాఠశాలలకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. సెలవులు వస్తే పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తా చెదారం ఉండకుండా, ఇతరులు ఎవ్వరూ కాంపౌండ్లోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందిని, గ్రామస్తులను బాధ్యత తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. దాదాపు రూ. 22 లక్షలు ఖర్చు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్ రావు, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, రాచలూరు గ్రామ సర్పంచ్ శ్రీనివాసాచారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.