గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులకు కాంగ్రెస్ సర్కార్ చెక్ పవర్ కట్టబెట్టడంలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలనాపరమైన ఎన్నో కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. చెక్ పవర్ ఇవ్వకపోవడంతో నిధులను డ్రా చేసే అవకాశం లేక పంచాయతీలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా రంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పాలన పట్టు తప్పుతున్నది.
-రంగారెడ్డి, మార్చి 2 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పాలన ఈ ఏడాది జనవరితో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేక ప్రత్యేకాధికారులను నియమించి ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక పాలనను కొనసాగిస్తున్నది. 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించింది. గెజిటెడ్ అధికారుల కొరతతో ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలను అప్పగించగా.. వారు గత పాలకవర్గాల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకాధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శికి కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటికీ అమలుచేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నది.
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, ఇతర కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రతి నెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 ఫైనాన్స్ కార్పొరేషన్ కింద పీఎఫ్ఎంఎస్, ఎస్ఎఫ్సీ, జనరల్ ఫండ్ నిధులను విడుదల చేస్తున్నాయి. వీటిని గతంలో సర్పంచులు, ఉప సర్పంచులు వారి చెక్ పవర్ ద్వారా అవసరం మేరకు వినియోగించుకునే వారు. ప్రస్తుతం ఆ పవర్ను ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడంతో పాలనా పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నిత్యం చేపట్టే పారిశుధ్య నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, తాగునీటి పైపులైన్, మోటర్ల, వీధిలైట్ల మరమ్మతులు తదితర పనులను చెల్లింపులు చేయలేని పరిస్థితి నెలకొన్నది. తప్పని పరిస్థితుల్లో సొంత డబ్బులు వెచ్చించిడమో, లేదంటే డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పి పనులు చేయించడమో చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులు, సిబ్బంది వేతనాలతోపాటు కొన్ని చోట్ల ట్రాక్టర్ల కిస్తీలూ చెల్లించాల్సి ఉన్నది. ఇవన్నీ అత్యవసరం కాగా.. చెక్ పవర్ లేని కారణంగా పంచాయతీ అధికారులకు బిల్లుల చెల్లింపు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇది పంచాయతీల్లో అభివృద్ధికి సైతం ఆటంకంగా మారుతున్నది.
ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన ఫైల్ను కలెక్టర్కు పంపించాం. అనుమతి రాగానే చెక్ పవర్కు సంబంధించి చర్యలు తీసుకుంటాం. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– సురేశ్, రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి