ఇబ్రహీంపట్నం, మే 29 : రిక్రియేషన్ జోన్ పేరిట బలవంతంగా రైతుల నుంచి భూములను తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని.. రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హెచ్ఎండీఏ ద్వారా ల్యాండ్పూలింగ్ చేయతలపెట్టిన ఇబ్రహీంపట్నం, శేరిగూడ, ఉప్పరిగూడ, కప్పాడు, పోచారం, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ గ్రామాలకు చెందిన రైతులు, రైతు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ లేక్ డెవలప్మెంట్, రిక్రియేషన్ జోన్ల పేరిట ఎనిమిది గ్రామాల్లో పచ్చని పంట పొలాలను సేకరించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడుతామని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు రైతుల నుంచి భూములను సేకరించొద్దని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు దొడ్డిదారిలో రైతుల భూములను గుంజుకునే ప్రయత్నాలు చేయటమేంటని మండిపడ్డారు.
హెచ్ఎండీఏ అధికారులు గ్రామాల్లోకి వచ్చి అసైన్డ్ భూములకు ఎక రానికి 600 గజాలు, పట్టా భూములకు ఎకరానికి 1740 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని.. భూములు రాసి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి దృష్టికి తీసుకురాగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పంటపొ లాలను తీసుకోవడం ఏమిటని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులకు అంగీకార పత్రాలు ఇవ్వొద్దని.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేయాలని రైతు నాయకులకు సూచించారు.
త్వరలోనే ఎనిమిది గ్రామాల రైతులతో సమావేశమై ప్రభుత్వ కుట్రలపై పోరాటానికి శ్రీకారం చుడతానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి అవసరమైన కూరగాయలను ఈ గ్రామాల రైతులు పండించి సరఫరా చేస్తారని.. అలాంటి భూములను కాజేసేందుకు ప్రభుత్వం యత్నించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ సత్తువెంటకరమణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ యాదగిరి, సర్పంచ్ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, అంజిరెడ్డి, జిల్లా సభ్యుడు మోహన్రెడ్డి, నాయకులు గీతారాంరెడ్డి, గణేశ్, పవిత్ర, శ్రీనివాస్రెడ్డి, బీరప్ప, భరత్కుమార్, సురేశ్, శంకర్, ప్రభాకర్రెడ్డి, జలంధర్, వీరయ్య, సుధాకర్, నరేందర్, భాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.