ధారూరు, ఫిబ్రవరి 8 : వికారాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్నెపల్లిలోని బాల రక్షా భవన్ కార్యాలయంలో బుధవారం జువైనల్ జస్టిస్ బోర్డ్ (బాలల న్యాయ మండలి)ను వికారాబాద్ జిల్లా జడ్జి సుదర్శన్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీకాంత్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇదివరకు జువైనల్ జస్టిస్ బోర్డ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగుతూ ఉండేదన్నారు.
నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక జువైనల్ జస్టిస్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ నిబంధనల ప్రకారం పిల్లలను సాధారణ క్రిమినల్ కోర్టుకు తీసుకెళ్లకూడదన్నారు. బాలలు నేర కార్యకలాపాల నుంచి బయటపడేందుకు శిక్షణ ఇప్పించి వారిని భావి భారత పౌరులుగా తయారు చేయాలని వివరించారు.
నేరారోపణకు గురైన పిల్లలకు పునరావాసం కల్పించేందుకు వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. వివిధ కారణాల వల్ల కొంతమంది తల్లిదండ్రులు పోషణ భారమై తమ పిల్లలను వదిలివేస్తారన్నారు. ఇటువంటి పిల్లలకు ప్రభుత్వం తరఫున శిశుగృహ హోమ్, తప్పిపోయిన పిల్లల కోసం పోలీస్ శాఖ తరఫున దర్పన్ యాప్ రూపొందించడం జరిగిందని తెలిపారు.
జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి మాట్లాడుతూ.. జువైనల్ జస్టిస్ బోర్డ్లో ఇద్దరు సభ్యులు ఉంటారని.. అందులో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలని చట్టంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యుడు శీతల్, జిల్లా ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా ప్రోహిబిషన్ ఆఫీసర్ గౌతమి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, జువైనల్ జస్టిస్ బోర్డ్ సభ్యుడు వాసు, డీఎస్పీ సత్యనారాయణ, బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ శ్రీలక్ష్మి, లీగల్ ఆఫీసర్ నరేశ్కుమార్, డీసీపీయూ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.