తాండూరు, అక్టోబర్ 31 : సరిహద్దుల్లో అక్రమంగా తరలించే మద్యం, డ్రగ్స్, డబ్బు తరలించే వాహనాలను గుర్తించేలా, క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చెక్ పోస్ట్ల వద్ద నిఘా మరింత పటిష్టం చేశామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కరణ్కోట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కోత్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును ఎస్పీ కోటిరెడ్డితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా ఎన్నికల అధికారికి లింక్ చేయబడి ఉంటాయన్నారు. ఎన్నికల కమిషన్ అనునిత్యం సీసీ కెమెరాల రికార్డులను పరిశీలిస్తుందన్నారు. ఎలక్షన్లు పూర్తయ్యేవరకు నిర్విరామంగా వాహన తనిఖీలు చేయాలన్నారు. పోలీస్శాఖ, ఆబ్కారీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాండూరులోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను వారు పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థను పరిశీలించారు. తాండూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ తారాసింగ్, రెవెన్యూ, పోలీస్, ఆబ్కారీ శాఖ అధికారులు ఉన్నారు.