యాలాల,మే22: అమ్మ ఆదర్శ పాఠశాలకు వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం యాలాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఉర్దు మాధ్యమ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ నెల చివరి వరకు పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఏకరూప దుస్తులు తయారు చేస్తున్న కేంద్రాన్ని పరిశీలించి దుస్తుల తయారీలో నాణ్యత పాటించడంతో పాటు నిర్ణీత సమయం కంటే ముందే దుస్తులను ఇవ్వాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు ఉన్నారు.