Haritha Haram | అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చేపట్టిన ఎనిమిది విడుతలు విజయవంతంగా పూర్తి కావడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేడు ఎటుచూసినా పచ్చదనం పరిఢవిల్లుతున్నది. కోట్లాది మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. రోడ్లకు ఇరువైపులా.. ప్రభుత్వ స్థలాలు, గ్రామాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, పల్లె, పట్టణ, బృహత్ ప్రకృతివనాలు, అర్బన్ పార్కుల్లో పెద్ద ఎత్తున నాటిన మొక్కలతో పచ్చదనం కొంగొత్త అందాలను సాక్షాతరింపజేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో పల్లెప్రగతిలో భాగంగా 867 పల్లె, 105 బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయగా.. పట్టణాల్లోనూ 257 పార్కులను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పచ్చని మొకలతో పర్యాటక ప్రాంతాలకూ కొత్త కల వచ్చింది. ఇప్పటివరకు ఏడు కోట్లకు పైగా మొక్కలను నాటడంతో పచ్చదనం 99.54 శాతానికి పెరిగింది. మొదటి విడుత(2015-16)లో 73.78 లక్షలు, ఎనిమిదో విడుత (2022-23)లో 81.41 లక్షల మొక్కలను నాటారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు నాటిన మొక్కలతో పచ్చదనం 3-4 శాతం మేర పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. హరితహారం కార్యక్రమం ప్రా రంభానికి ముందు జిల్లాలో గ్రీనరీ 22 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 26శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు. 2015-16లో 73.78 లక్షలు.. 2022-23లో 40.25 లక్షల మొ క్కలను నాటారు. జిల్లాలో ఇప్పటివరకు 4.27 కోట్ల మొక్క లను నాటారు. అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో గత ఎనిమిదేండ్లుగా అటవీ ప్రాంతాల్లో 62 లక్షల మొక్కలను నాటారు. పుడమికి ఆకుపచ్చ కిరీటాన్ని తొడిగేందుకు గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలతోపాటు పలు విభాగాల అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు హరితోత్సవాన్ని నిర్వహించనున్నారు.
-రంగారెడ్డి, జూన్ 18(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘ఒకప్పుడు ఎటుచూసినా కొండలు, గుట్టలు.. చూద్దామన్నా పచ్చదనం కానరాక పోయేది. కానీ.. సీఎం కేసీఆర్ సంకల్పంతో రంగారెడ్డి జిల్లాలో నేడు ఎటుచూసినా పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అవకాశం ఉన్న చోటల్లా మొకలను నాటి సంరక్షించడంతో తొమ్మిదేండ్లలో అనూహ్యంగా పచ్చదనం పెరిగింది. పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, అర్బన్ పారులతో పచ్చదనం కొంగొత్త అందాలు ఆవిష్కృతమవుతున్నాయి. పచ్చని మొకలతో పర్యాటక ప్రాంతాలకూ కొత్త కల వచ్చింది. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 7కోట్లకు పైగా మొకలను నాటారు. ఫలితంగా జిల్లాలో 99.54 శాతానికి పచ్చదనం పెరిగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు హరితోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
ప్రతిష్టాత్మకంగా హరితహారం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేడు ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నది. అన్ని శాఖలు సైతం సమష్టిగా పచ్చదనం పెంపునకు చేస్తున్న కృషి ఫలిస్తున్నది. ఫలితంగా ఎటుచూసినా పచ్చదనం వెల్లివిరుస్తున్నది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీఎస్ఎఫ్ డీసీ, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్ విభాగాల ద్వారా ఫారెస్ట్ బ్లాక్లను అర్బన్ బ్లాకులుగా అభివృద్ధి చేస్తున్నారు. పల్లె ప్రగతిలో 867 పల్లె ప్రకృతి వనాలు, 105 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణాల్లోనూ 257 పారులను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా మీదుగా వెళ్తున్న ఔటర్ రింగ్ రోడ్డు సైతం ప్లాంటేషన్తో కొత్తందాలకు నిలయంగా మారింది. చెరువు కట్టలపై, పొలం గట్ల వెంట, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొకలను నాటేలా చర్యలు తీసుకున్నారు. తొమ్మిదేండ్లలో 7 కోట్లకుపైగా మొకలను నాటడంతో జిల్లాలో పచ్చదనం 99.54 శాతానికి పెరిగింది.
పర్యావరణహితంగా తీర్చిదిద్దుతూ..
కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటుండడంతో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ హితంగానూ జిల్లాను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నది. పెరుగుతున్న వాహన రాకపోకలకు దీటుగా పచ్చదనం పర్చుకుంటుండడంతో కాలుష్య తీవ్రత సైతం తగ్గుతూ వస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు, జీరో ఎమిషన్, పరిశ్రమలకు నిలయంగా ఉన్న జీరో డిశ్చార్జ్ వంటి వినూత్న కార్యకలాపాలతో పారిశ్రామిక కాలుష్య తీవ్రతను తగ్గించేలా ప్రభుత్వం కృషిచేస్తున్నది. క్షీణించిన అడవులను పునరుద్ధరించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని ప్రభుత్వం అందించేందుకు కృషిచేస్తోంది.
నందిగామ, జూన్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. తొమ్మిదో విడుత హరితహారంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నందిగామ మండలంలో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
హరితహారానికి ప్రత్యేక ఏర్పాట్లు..
నందిగామ మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ఉపాధిహామీ పథకం, ఈజీఎస్ పథకాలతో ప్రతి గ్రామ పంచాయతీలోనూ నర్సరీలను ఏర్పాటు చేశారు. నందిగామ మండలంలో 18 గ్రామపంచాయతీలు ఉండగా 18 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 1,80,000 మొక్కలు పెంచుతున్నారు. ఇందులో కానుగ, మునగ, చింత, వేప, కార్జూరా, జామ, రావి, దానిమ్మ, నీలగిరి, నేరడు, కరివేపాకు, పతంగి, గోరింటాకు తదితర మొక్కలు ఉన్నాయి. మూడు సంవత్సరాలుగా సుమారు 2లక్షల మొక్కల వరకు నాటారు. నందిగామ మండలంలో మొత్తం 26పల్లె ప్రకృతి వనాలు, ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం ఉన్నది. తొమ్మిదో విడుత హరితహారం వచ్చే నెలలో ప్రారంభం కానున్నది. ప్రభుత్వం విధించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
హరితోత్సవానికి ఏర్పాట్లు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న నిర్వహించే తెలంగాణ హరితోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. ప్రతి పంచాయతీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వికారాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో జిల్లాలో పచ్చదనం పెంపొందింది. జిల్లాలో గ్రీనరీని పెంచేందుకుగాను ప్రతి ఏటా అటవీ శాఖ, డీఆర్డీఏ శాఖలతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ వస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాలను గుర్తించి హరితహారంలో భాగంగా వందల ఎకరాల్లో మొక్కలు నాటారు. అంతేకాకుండా కొన్ని అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సీడ్ బాల్స్ కూడా వేశారు. అటవీ ప్రాంతాల్లో ఉండే మొక్కలతోపాటు ఔషధ మొక్కలను కూడా జిల్లా అటవీ శాఖ యంత్రాంగం నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో జిల్లాలో పచ్చదనం 3-4 శాతం మేర పెరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. హరితహారం కార్యక్రమం ప్రారంభానికి ముందు 22 శాతంగా ఉన్న జిల్లాలో పచ్చదనం ప్రస్తుతం 26 శాతం మేర పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
అటవీ ప్రాంతంలో నాటిన 62 లక్షల మొక్కలు..
హరితహారం కార్యక్రమంతో జిల్లాలోని అటవీ ప్రాంతాలు మొదలుకొని రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాలు, గ్రామాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో, కమ్యూనిటీ భవనాలు, పల్లె, బృహత్ ప్రకృతి వనాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17 సంవత్సరంలో 1.39 కోట్ల మొక్కలు, 2017-18లో 71.04 లక్షలు, 2018-19లో 86.12 లక్షలు, 2019-20లో 1.02 కోట్ల మొక్కలు, 2021-22లో 74 లక్షలు, 2022-23లో 40.25 లక్షల మొక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 38.70 లక్షల మొక్కలను జిల్లాలో నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొదటి నుంచి అధిక మొత్తంలో మొక్కలు నాటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 2015-16లో 8 లక్షల మొక్కలు, 2016-17లో 10 లక్షలు, 2017-18లో 8.2లక్షలు, 2018-19లో 6.98 లక్షలు, 2019-20లో 12.08 లక్షలు, 2020-21లో 8.28 లక్షలు, 2021-22లో 7.05 లక్షల మొక్కలను అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటారు. జిల్లాలో 599 నర్సరీల్లో హరితహారం నిమిత్తం ప్రతి ఏటా మొక్కలను పెంచుతూ వస్తున్నారు. అంతేకాకుండా పల్లెప్రకృతి వనాలు, బృహత్పల్లెప్రకృతివనాలతో జిల్లాలో పచ్చదనం మరింత పెంపొందుతుంది.
ప్రజలు భాగస్వామ్యం కావాలి..
తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం. తెలంగాణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి.
– బాల్రెడ్డి, ఎంపీడీవో, నందిగామ మండలం