సీఎం కప్ క్రీడోత్సవాలకు యువత నుంచి విశేష స్పందన లభించింది. ఇదివరకే మండల స్థాయి పోటీలు ముగియగా.. మూడు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి పోటీలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. వివిధ క్రీడా పోటీల్లో కలిపి వికారాబాద్ జిల్లా నుంచి129 మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 238 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యఅతిథులుగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. వికారాబాద్లో జరిగిన ముగింపు కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందన్నారు.
వికారాబాద్/ ధారూరు, మే 24 : విద్యార్థులు, యువత చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాస్థాయి సీఎం కప్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ప్రతిభ క్రీడల ద్వారా బయటపడుతుందన్నారు. ఎక్కడ క్రీడలు నిర్వహిస్తే అక్కడ పాల్గొని ప్రతిభ చూపాలని సూచించారు. క్రీడలు ఆడటం వల్ల స్నేహభావం పెరగడంతోపాటు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో రాణించినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.
జిల్లాకు మంచి పేరు తేవాలి
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. క్రీడలతోపాటు జూన్ 2 నుంచి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోబోతున్నామన్నారు. 21 రోజుల పాటు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో 10 సంవత్సరాల అభివృద్ధిపై ప్రతి ఒక్కరికీ తెలిసే విధంగా ముందుకు సాగుదామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ మెమెంటోలు, బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, ఎంపీపీ చంద్రకళ, దళిత ఉత్సవాల కమిటీ మాజీ అధ్యక్షుడు రాజలింగం, జిల్లా యువజన,క్రీడల శాఖ అధికారి హనుమంత్రావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోఠాజీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, సీఎం కప్ క్రీడల చైర్మన్ మహమ్మద్ ఖాజా, కన్వీనర్ వినోద్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింహులు, పీఈటీలున్నారు.
ముగిసిన జిల్లాస్థాయి క్రీడలు
ఆర్కేపురం : సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహించిన రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడ పోటీలు బుధవారం ముగిశాయి. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ పొందిన (1236) ఉత్తమ క్రీడాకారులు జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొన్నారు. మొదటి విజేత వాలీబాల్ పురుషుల విభాగంలో ఫారూఖ్నగర్, రెండో విజేత గండిపేట మండలం. వాలీబాల్ మహిళా విభాగంలో మొదటి విజేత తలకొండపల్లి, రెండో విజేత యాచారం మండలం. కబడ్డీ పురుషుల విభాగంలో మొదటి విజేత అబ్దుల్లాపుర్మెట్, రెండో విజేత సరూర్నగర్ మండలం, మహిళా విభాగంలో మెదటి విజేత సరూర్నగర్, రెండో విజేత బాలాపూర్ మండలం. ఖో-ఖో పురుషుల విభాగంలో మొదటి విజేత సరూర్నగర్, రెండో విజేత హయత్నగర్ మండలం. మహిళా విభాగంలో మొదటి విజేత హయత్నగర్, రెండో విజేత యాచారం మండలం, ఫుట్బాల్ విభాగంలో మొదటి విజేత సరూర్నగర్, రెండో విజేత యాచారం మండలం, బాస్కెట్బాల్ పురుషుల విభాగంలో మొదటి విజేత సరూర్నగర్, రెండో విజేతగా హయత్నగర్ మండలం జట్లు విజేతలుగా నిలిచారు. జిల్లా స్థాయిలో 18 క్రీడాంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన (238) మంది క్రీడాకారులను ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. గెలుపొందిన జట్లకు కప్తో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు.
జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన పరిగి వాలీబాల్ జట్టు
పరిగి : సీఎం కప్ పోటీల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో పరిగి మండలం జట్టు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది. వికారాబాద్ జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో పరిగి జట్టు విజేతగా నిలువడంపై పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీలు నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిగి జట్టు రాష్ట్ర స్థాయిలోనూ విజేతగా నిలువాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన పరిగి మండల జట్టును ఎంపీపీ కరణం అరవిందరావు అభినందించారు.
రాష్ట్రస్థాయికి 367 మంది ఎంపిక
మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో వికారాబాద్ జిల్లా నుంచి 129 మంది వివిధ క్రీడా పోటీల్లో ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. కబడ్డీ 20 మంది, ఖో-ఖో 24, ఫుట్బాల్ 16, వాలీబాల్ 20, బాస్కెట్బాల్ 12, హ్యాండ్బాల్ 12, ఇతర ఆటల పోటీల్లో 25 మంది ఎంపికైనట్లు చెప్పారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో వివిధ విభాగాల్లో 238 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.