షాబాద్/కులకచర్ల, మే 7 : సీఎం రేవంత్రెడ్డి ఎక్కడికెళ్తే అక్కడ దేవుళ్లపై ప్రమాణాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం మండలంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, బీఆర్ఎస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో కులకచర్ల, చౌడాపూర్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభ.. అదేవిధంగా షాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, పార్లమెంట్ ఎన్నికల ఇన్చా ర్జి రాంబాబుయాదవ్తో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. పాలనను, ప్రజల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ గాలికి వదిలేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానినీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని.. దానిని కప్పిపుచ్చుకునేందుకు, ఈ లోక్సభ ఎన్నికల్లోనూ అధిక స్థానాల్లో విజయం సాధించేందుకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్లు పెట్టుకుంటూ మరోసారి జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తానని చెప్పి ఇప్పటికీ ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలను కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేసే దమ్ము, చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వెన్నుపోటు పొడిచిన రంజిత్రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు ఒక్కటే చెబుతున్నారని..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకా కరెంట్, పింఛన్లు రావడంలేదని అంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన ఉన్నన్ని రోజులు కరెంట్, రైతుబంధు కష్టాలు లేవన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదన్నారు.
లోక్సభ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలే చెబుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయి ఇబ్బందులు పడుతున్నామని, మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని ఆమె ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. షాబాద్ అంటేనే ఇంద్రారెడ్డికి ఎంతో ప్రాణమని, నియోజకవర్గంలో అన్నింటికన్నా ఎక్కువ మెజార్టీ షాబాద్లో వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపు చేస్తామని రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టుకుంటున్నారని, సీఎం షాబాద్కొస్తే సీతారాంపూర్లోని సీతారామచంద్రస్వామిపైనా ఒట్టు వేస్తాడేమోనని స్వామివారు భయపడుతున్నారని అన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని..కొత్త పథకాలు దేవుడెరుగు బీఆర్ఎస్ హయాంలో కొనసాగిన పథకాలూ సక్రమంగా అమలు కావడంలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన పాపానికి ఎన్నో అవస్థలు పడుతున్నామని.. మరోసారి ఆ తప్పు చేయొద్దన్నారు. ఈ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి బీఆర్ఎస్ అధినేతకు గిఫ్టుగా ఇద్దామన్నారు. షాబాద్లో వర్షంలోనూ జరిగిన కార్నర్ మీటింగ్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది.
మూడుసార్లు కరెంట్ కట్..
కులకచర్లలో ప్రజా ఆశీర్వాద సభ జరుగుతున్న సమయంలో మూడు సార్లు కరెంటు పోవడంతో ఒక్కసారిగా ప్రజలు నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సమావేశాలకు విద్యుత్ను నిలిపేయడంతో పలువురు మండిపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాసాని వీరేశ్, కొప్పుల అనిల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడూర్ నర్సింగ్రావు, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్నాయక్, శ్రీనివాస్గౌడ్, వెంకటయ్య, నర్సింహారెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్రెడ్డి, రాజేందర్గౌడ్, వెంకట్యాదవ్, గణేశ్గౌడ్, ఇమ్రాన్, ముఖ్రంఖాన్, రాజేందర్రెడ్డి, రమేశ్యాదవ్, మధుకర్రెడ్డి, రాందేవ్యాదవ్, దర్శన్, రాజు, వెంకట్, జుబేర్, సునంద, పాండురంగయ్య, రామన్నమాదిగ, రాజప్ప, కృష్ణయ్యగౌడ్, బుచ్చయ్య, నర్సింహ, వెంకటయ్య పాల్గొన్నారు.
మూడోసారి గులాబీ జెండా ఎగురవేద్దాం.. ; -కాలె యాదయ్య, ఎమ్మెల్యే చేవెళ్ల
చేవెళ్ల గడ్డపై మూడోసారి గులాబీ జెండాను ఎగురవేద్దాం. 70 ఏండ్లలో ఏ ప్రభుత్వాలూ, సీఎంలూ చేయని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందుల కు గురి చేస్తున్నది. ఏ పథకం కూడా సక్రమంగా అమలు కావడంలేదు. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేశామా అని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత బీసీ నాయకుడికి చేవెళ్ల నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. బడుగు, బలహీన వర్గాల వారందరూ పార్టీలకతీతంగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు కృషి చేయాలి. కారు గుర్తుకు ఓటేయాలి.
బీసీల సత్తా చూపాలి..; స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
లోక్సభ ఎన్నికల్లో బీసీల సత్తాను చూపాలి. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలంతా పార్టీలక తీతంగా.. గుర్తులతో సంబంధం లేకుండా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు కృషి చేయాలి. బీఆర్ఎస్ అధినేత బీసీలకు చేవెళ్ల టికెట్ను కేటాయించడం శుభ పరిణామం. కాసాని 96 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆయన ఎంపీగా గెలవాల్సిందే. మన సత్తా చాటాల్సిందే.
కాసానిని గెలిపించాలి..; -కొప్పుల మహేశ్రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. ఢిల్లీలో మన వాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. కాసాని జ్ఞానేశ్వర్ జడ్పీచైర్మన్గా, ఎమ్మెల్సీగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయనకు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలున్నాయి. కాసానిని గెలిపించి బీఆర్ఎస్ అధినేతకు గిఫ్టుగా ఇద్దాం.
ఓటు వేసి ఆశీర్వదించండి..
ఓటు వేసి గెలిపిస్తే అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తా. బీఆర్ఎస్ పార్టీ బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. ఈ లోక్సభ ఎన్నికల్లో బీసీలకు ఆరు ఎంపీ సీట్లు కేటాయించింది. కేసీఆర్ హయాం లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ అందాయి. కానీ.. ఐదు నెలల కిందట వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో సబ్బండ వర్ణాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పాలకులకు ప్రజల సమస్యలు పట్టడంలేదు. నన్ను గెలిపిస్తే రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతా. చేవెళ్ల టికెట్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు.