యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామం అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటి ఏర్పాటుకు గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోవడంతో గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవతో గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. దీంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి.
రూ. కోటితో సీసీ రోడ్ల నిర్మాణం..
గ్రీన్ ఫార్మాసిటి ఏర్పాటు కోసం గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోయారు. దీని కోసం గ్రామానికి ప్రత్యేక నిధులు కెటాయించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు టీఎస్ఐఐసీ శ్రీకారం చుట్టింది. గ్రామంలో సీసీ రోడ్ల కోసం ప్రత్యేకంగా రూ. కోటి నిధులను కెటాయించింది. రూ. కోటితో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో 2.5కిలో మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. మెయిన్ రోడ్లతో పాటు చిన్నపాటి గల్లీలలో సీసీ రోడ్లు వేశారు. దీంతో గ్రామంలో నూతనంగా వేసిన రోడ్లతో కాలనీలు అద్దంలా మెరుస్తున్నాయి. మిగతా కాలనీల్లోనూ సీసీరోడ్లు వేసేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు.
ముమ్మరంగా భూగర్భ డ్రైనేజీ నిర్మాణం
గ్రామం ఒకప్పుడు ఓపెన్ మురుగు కాలువలతో అధ్వాన్నంగా ఉండేది. మురుగు నీరు ఊరంతా దుర్గంధం వెదజల్లేది. వర్షాలు కురిసినప్పుడు మురుగు నీరంతా రోడ్లపై, ఇండ్ల మధ్య నుంచి ఏరులా ప్రవహించేది. సమస్యకు చెక్ పెడుతూ గ్రామంలో ముమ్మరంగా భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. గ్రామంలో కొన్ని కాలనీల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి కాగా, ఇంకొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి కృషి చేస్తున్నారు.
ఇంటికో ఉద్యోగం కోసం ఉచిత శిక్షణ
ఫార్మాసిటి ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉపాధి అవకాశం కోసం 45రోజుల ఉచిత శిక్షణను ప్రారంభించింది. మొదటి విడుత కింద కొంతమందికి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో తుక్కగూడలో ఉచిత శిక్షణ నిర్వహిస్తుంది. దీని కోసం సుమారు వందమంది యువతీ యువకులు నిత్యం శిక్షణ శిబిరానికి వెళ్లి శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భోజన వసతితో పాటు కనీస వేతనాన్ని అందజేయనున్నట్లు టీఎస్ఐఐసీ అధికారులు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. దీంతో గ్రామంలో నిరుద్యోగ సమస్య తీరనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భూ నిర్వాసితులకు 121గజాల ప్లాటు
ఫార్మా ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ ప్లాట్లు ఇచ్చేందుకు సిద్దమైంది. దీనికోసం కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో శ్రీశైలం, సాగర్ రహదారిని కలుపుతూ వెళ్లే సరిహద్దు ప్రాంతంలో హెచ్ఎండీఏ వెంచర్ను ఏర్పాటు చేస్తుంది. లే-అవుట్ పనులను మంత్రి సబితారెడ్డి ప్రారంభించడంతో పనులు సైతం కొనసాగుతున్నాయి. భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 121గజాల ప్లాటును ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో తక్కువ ధరలకు భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు కెటాయించడంతో అన్ని విధాలుగా మేలు జరుగనుంది. ఇది ఫార్మా భూ నిర్వాసితులకు వరంగా మారనుంది.
డుబుల్ రోడ్ల నిర్మాణం
ఫార్మాసిటి ఏర్పాటుతో లింకు రోడ్లకు మోక్షం లభించనుంది. నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు, మీర్ఖాన్ పేట నుంచి నజ్దిక్సింగారం, నందివనపర్తి, మొగుళ్లవంపు గ్రామాల మీదుగా యాచారం వరకు డబుల్ రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణం కోసం ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. రోడ్డు సర్వే పనులు సైతం పూర్తయ్యాయి. నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిషన్రెడ్డి నందివనపర్తిలో శంకుస్థాపన చేశారు. నందివనపర్తి-మేడిపల్లి మధ్యలో రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. రహదారి వెడల్పు కోసం రైతుల పట్టా భూముల సేకరణ పనులు కొనసాగుతున్నాయి.