షాబాద్, ఫిబ్రవరి 17 : సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేశం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం రంగారెడ్డిజిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో వెంకటేశం సఫాయి కర్మచారులకై జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, జిల్లా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఫాయి కర్మచారులకు పునరావాసం కల్పించుటలో ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సఫాయి కర్మచారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న సఫాయి కర్మచారులకు వేతన స్లిప్, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్లు తెలిపారు.
సఫాయి కర్మచారులు అపరిశుభ్రమైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేయడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని.. వీరు నివసించే ప్రాంతాల్లో సంవత్సరానికి 2సార్లు తప్పనిసరిగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సఫాయి కర్మచారులకు ఉపాధి కల్పనలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో కర్మచారులను నియమించి వీరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను అందించాలని ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు వారు సద్వినియోగపర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మహిళా కార్మికుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సఫాయి కర్మచారులకు ప్రధానమంత్రి బీమా యోజన స్కీమ్పై అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నర్సింహులు, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్రెడ్డి, జిల్లా మైనార్టీశాఖ అధికారి నవీన్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి రామేశ్వరిదేవి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎల్డీఎం కుసుమ, సఫాయి కర్మచారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డిజిల్లా సమీకృత కార్యాలయానికి శనివారం వచ్చిన సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేశంకు కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నర్సింహులుతో కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు.