యాలాల : పేకాట ఆడుతున్న ఆటగాళ్ల గుట్టును వికారాబాద్ జిల్లా టాస్క్ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని సాయిబాబా మందిరం వెనకాల ఉన్న ఇంట్లో శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్పోర్సు సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 9మంది పేకాట ఆడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అదే విధంగా వీరి వద్ద నుంచి పేకాట ముక్కలు, రూ. 30వేల 600లతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన యాలాల పోలీస్టేషన్ పరిధిలోకి రావడంతో వివరాలను సేకరించి పట్టుబడిన పేకాటరాయుళ్లను యాలాల పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని యాలాల ఎస్సై శంకర్ తెలిపారు.