రంగారెడ్డి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు జరిగే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన పాల్గొంటారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎంపీ ఎన్నికల తొలి ప్రచార బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మాజీ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి శుక్రవారం సభా ఏర్పాట్లను పరిశీలించారు. గులాబీ బాస్ రాకతో జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కనున్నది.
బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వం సిద్ధం చేసింది. 2 లక్షల మందికి పైగా జనం సభకు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాగునీరు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నారు. సభకు వచ్చే వీఐపీలు, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళల కోసం వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. షాబాద్ నుంచి వచ్చే వాహనాలకు అదే రూట్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. సభా స్థలికి కొద్ది దూరంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. అక్కడే తమ వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన సభా ప్రాంగణానికి ప్రజలు చేరుకోవాల్సి ఉంటుంది.
ఫరా కళాశాల మైదానంలోని విశాలమైన స్థలంలో సభకు ఏర్పాట్లు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మైదానంలో బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించింది. కేసీఆర్ రోడ్డు మార్గంలోనే సభకు రానున్నట్లు తెలిసింది. ఒకవేళ.. హెలికాప్టర్లో వస్తే.. అందుకు సైతం నేతలు ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు దగ్గరుండి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కేసీఆర్ పాల్గొనే ఎన్నికల బహిరంగ సభకు చేవెళ్ల ముస్తాబైంది. పట్టణంలోని రోడ్లన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలను పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని సైతం గులాబీమయం చేశారు. ప్రజలు దూరం నుంచి కూడా సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.