రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరానికి రావాల్సిన ఐటీ, ఐఆర్ కంపెనీని ఎందుకు రద్దు చేశారో బీజేపీ నేతలు తెలుపాలి. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం కోసం పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్కామ్ల కోసం పని చేస్తున్నది. దేశ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయన్న భయంతోపాటు మోదీ పీఠం ఎక్కడ కదులుతుందోనని బీజేపీ నేతలు ఆందోళనలో పడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరు.
-సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి
డప్పు చప్పుళ్లు, బోనాల ఊరేగింపు, కోలాటాలు, భారీ ర్యాలీలతో ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలుకగా.. ప్రసంగాలు, జై కేసీఆర్, జైజై బీఆర్ఎస్ నినాదాలు హోరెత్తంగా మంగళవారం పార్టీ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు పండుగ వాతావరణంలో జరిగాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు సందడిగా సాగాయి. ఒక్కో సమావేశానికి 3 వేలకుపైగా పార్టీ ప్రతినిధులు తరలివచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
-న్యూస్ నెట్వర్క్ , ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ)
గులాబీ రెపరెపలు..
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంగళవారం ఉదయం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాడవాడలా, గ్రామగ్రామానా గులాబీ జెండాలను ఎగురవేశారు. దీంతో పల్లెలు, పట్టణాలు గులాబీమయంగా మారాయి.
డంగ్పేట, ఏప్రిల్ 25 : సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆయన తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బాలాపూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ సమీపంలో బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై 21 తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి.. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహేశ్వరానికి రావాల్సిన ఐటీ, ఐఆర్ కంపెనీని ఎందుకు రద్దు చేశారో బీజేపీ నాయకులు తెలుపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం కోసం పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్కామ్ల కోసం పని చేస్తుందన్నారు.
దేశ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయన్న భయంతో మోదీ పీఠం ఎక్కడ కదులుతుందోనని బీజేపీ నాయకులు ఆందోళనలో పడ్డారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు అన్నారు. త్వరలో మహేశ్వరం మండల పరిధిలోని మీర్ఖాన్పేటలో పార్ట్స్ఖాన్ కంపెనీతో పాటు అదనంగా 52 కంపెనీలు వస్తున్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా కల్పించలేదో బీజేపీ ప్రభుత్వం చెప్పాలన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భవిష్యత్ లీడర్గా ఎదుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మీర్ఖాన్పేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను రూ.12 కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న గొలుసుకట్టు చెరువులను 37 కోట్లతో అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు.
జల్పల్లి మున్పిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కందుకూరు జడ్పీటీసీ బొక్క నర్సింహారెడ్డి, తుక్కుగూడ వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, అరవింద్శర్మ, ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్గౌడ్, లక్ష్మీ నర్సింహ్మ, చంద్రయ్య, బడంగ్పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, యువనేత కౌశిక్రెడ్డి, మహేశ్వరం అధ్యక్షుడు రాజునాయక్, తుక్కుగూడ అధ్యక్షుడు లక్ష్మయ్య, కందుకూరు అధ్యక్షుడు జయేందర్, యువజన విభాగం అధ్యక్షుడు ముద్దపవన్కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ నందీశ్వర్రెడ్డి, బడంగ్పేట ఫ్లోర్ లీడర్ సూర్ణగంటి అర్జున్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ యాతం పవన్కుమార్, సిద్దాల లావణ్య బీరప్ప, భూపాల్రెడ్డి, సంరెడ్డి వెంకట్రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.