బొంరాస్పేట, మార్చి 23 : మనదేశంలో పండుగలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో మతం, కులం వారు విభిన్న రీతిలో జరుపుకొంటుంటారు. ఈ విధంగా జరుపుకొనే పండుగలు వారి ఆచార సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అలాంటి వేడుకే హోలీ రోజున లంబాడాలు ‘దూండ్’ పేరుతో జరుపుకొనే హోలీ పండుగ. సాధారణంగా పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లలు మంచి వ్యక్తితో తమ వివాహం జరుగాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. హైందవ మతంలో ఇది ఒక ఆచారం. కానీ గిరిజనులకు చెందిన లంబాడా తెగవారు తమ మగ పిల్లలకు పెండ్లి కావాలంటే తప్పక హోలీ ఆడాల్సిందే. హోలీ ఆడితేనే మగపిల్లలకు పెండ్లి అవుతుందని వారు నమ్ముతారు. ఇది లంబాడా జాతిలో ఆనాదిగా వస్తున్న ఆచారం. అదే ఆచారాన్ని నేటికీ గిరిజనులు ఆచరిస్తున్నారు. బొంరాస్పేట మండలంలోని పలు గిరిజన తండాల్లో హోలీ పండుగ వచ్చిందంటే చాలు గిరిజనులు తమతండాల్లోని మగపిల్లలు పెండ్లి కావాలని ఆకాంక్షిస్తూ ్త ‘దూండ్’ను జరుపుకొంటారు. దూండ్ చేయకపోతే యువకులకు పెండ్లిళ్లు కావని వారి నమ్మకం.
దూండ్ అంటే తండాలోని ప్రతి ఇంటి ముందు పాయసం వండిన కుండలను కర్రలకు కడుతారు. ఆ విధంగా కట్టిన పాయసం కుండలను తండాల్లోని పెండ్లీడుకు వచ్చిన యువకులు ఎత్తుకెళ్లి తినాలి. ఈ సమయంలో మహిళలు యువకులను కట్టెలతో కొడుతారు. ఎంత కొట్టినా భరించి యువకులు వాటిని ఎత్తుకెళ్లాలి. ఈ కార్యక్రమం సుమారు గంటకుపైగా నిర్వహిస్తారు. బిందెలలో ఉన్న పాయసాన్ని ఎత్తుకెళ్లి తిన్న తరువాత యువకులు,యువతులు, చిన్నా పెద్దా అంతా కలిసి ఉత్సాహంగా రంగులు చల్లుకుని
హోలీని జరుపుకొంటారు. మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తారు. ఆ తరువాత బంధువులతో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు. దూండ్ వేడుకల్లో తండా ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొంటారు.