సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 2022-జూలైలో 4313 యూనిట్ల నివాస గృహాల విక్రయం ద్వారా రూ.2100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. కాగా 2022 జనవరి నుంచి జూలై నాటికి మొత్తం 40897 యూనిట్ల విక్రయాల ద్వారా రూ.20023 కోట్లు హైదరాబాద్లో నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది.
బుధవారం హైదరాబాద్లో జరిగిన నివాస గృహాల విక్రయాలు, వాటి ద్వారా జరిగిన లావాదేవీల విలువతో నివేదికను విడుదల చేశారు. ఇందులో 56 శాతం ఇళ్ల అమ్మకాలు విలువ రూ.25 లక్షల నుంచి రూ.50లక్షల మధ్యే ఉందని, అదేవిధంగా 72 శాతం అమ్మకాలు 1000 చదరపు అడుగుల నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నివాస అపార్టుమెంటు ఫ్లాట్లు ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. ఈ సందర్బంగా నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలోనూ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా ఉందని తెలిపారు.