ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 4 : విశ్వాస పరీక్ష నేపథ్యంలో బీహార్లో రాజకీయం వేడెక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్ శివారును ఎంచుకున్నది. వారం రోజులుగా హైదరాబాద్ శివారులోని శామీర్పేటలో జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించగా వారు ఆదివారం తిరిగి తమ రాష్ర్టానికి వెళ్లిపోగానే.. బీహార్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకున్నారు. బీహార్లో సీఎం నితీశ్కుమార్ కాంగ్రెస్ కూటమి నుంచి బయటకొచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ నెల 12న ఆయన బలపరీక్ష ఎదుర్కొను న్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరుగుతున్న కుట్రలను గమనించిన అధిష్ఠానం 16 మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ర్టానికి తరలించింది.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు అతి సమీపంలోని కాగజ్ఘాట్ గ్రామంలో ఉన్న సిరి నేచర్స్ రిసార్టుకు ఆదివారం సాయంత్రం భారీ బందోబస్తు మధ్య పదహారు మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సులో తీసుకొచ్చారు. ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో దీనిని ఎంపికచేశారు. పరిసరాల్లోనూ భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి క్యాంపు బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. బీహార్ ఎమ్మెల్యేలు ఈ నెల 11 వరకు ఇక్కడ ఆశ్రయం పొందనున్నారు.