కొడంగల్, డిసెంబర్ 5 : ధనార్జన కోసం వ్యాపారులు కల్తీలకు పాల్పడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని.. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో పట్టుబడ్డ కల్తీ కారంపొడిపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కల్తీ వ్యాపారులు పెట్రేగిపోతున్నారని.. ప్రజలు కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండి, ఇటువంటి సమాచారముంటే వెంటనే పోలీసులకు చేరవేయాలని సూచించారు. కల్తీ కారంపొడి అమ్మకాలు పట్టణంలో కొనసాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పట్టణంలోని రాందేవ్ కిరాణా దుకాణంలో వికారాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ వెంకటేశ్, కొడంగల్ సీఐ శంకర్, ఎస్ఐ రవితోపాటు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. దుకాణదారుడి నుంచి 10కేజీల కల్తీ కారంపొడిని గుర్తించి స్వాధీనం చేసుకొని వ్యాపారి జవేరిలాల్ను విచారించినట్లు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కపులాపురం గ్రామం, గండీడ్ మండలానికి చెందిన అవుసుల శ్రీనివాసాచారి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడన్నారు. వెంటనే శ్రీనివాసాచారి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 190 కేజీలు(3 బస్తాల) కల్తీ లూజ్ కారం పొడిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీనివాస్చారిని విచారించగా హైదరాబాద్ ఉప్పల్లోని సౌత్ స్వరూప్నగర్ కాలనీకి చెందిన అవ్వ రుద్రశేఖర్ సైప్లె చేస్తున్నట్లు తెలుపగా హైదరాబాద్లోని రుద్రశేఖ్ర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి.. 25బస్తాలు(చిన్నవి, పెద్దవి) మొత్తంగా 10 క్వింటాళ్ల కల్తీ కారం పొడిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కల్తీ కారం పొడి తయారీకి వినియోగించే మిర్చి పౌడర్, బియ్యపు పిండి, ఉప్పు, మంచినూనెతో పాటు ప్రాణానికి అధికంగా హాని కలిగించే ఎరుపు రంగు లభించినట్లు తెలిపారు. బియ్యం పిండితో తయారు చేయడంతో అధికంగా తూకం కలిసి వచ్చి ఎక్కువ లాభం వస్తుందని.. ప్రస్తుతం మార్కెట్లో అధికంగా ధర పలుకుతున్నట్లు వ్యాపారి తెలిపినట్లు వివరించారు.
లాభాలను ఆర్జించే క్రమంలో వ్యాపారులు ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా కల్తీ అమ్మకాలను జరుపుతున్నారని, హానికరమైన కెమికల్స్ను వాడుతున్నట్లు పేర్కొన్నారు. కల్తీపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని.. కల్తీ పదార్థాలను కొనుగోలు చేసి ఆరోగ్యాలకు దెబ్బతీసుకోవద్దని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే కల్తీ మహమ్మారిని అరికట్టవచ్చని తెలిపారు. కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని.. తక్కువ ధరలకు వస్తుందని మోసపోవద్దని సూచించారు. కల్తీ వ్యాపారాలపై పోలీసుల గట్టి నిఘా ఉందని, పట్టుబడ్డ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.