అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో సోమవారం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పులకించిపోయింది. భక్తుల సామూహిక పూజలు, శోభాయాత్రలు, కళాకారుల నృత్యాలు, అన్నదానాలు వంటి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో పండుగ వాతావరణం కనిపించింది. హిందువులు తమ ఇండ్లపై కాషాయ జెండాలను ఎగురవేశారు.
ఊరూరా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని అయోధ్యలో జరిగిన కార్యక్రమాన్ని కనులారా వీక్షించారు. ఇండ్ల వద్ద, దేవాలయాల్లో దీపాలు వెలిగించి జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్ అంటూ నినాదించారు. మహిళలు బోనాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పలు దేవాలయాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. షాబాద్ మండలంలోని సీతారాంపూర్లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేక పూజలు చేశారు.