షాద్నగర్ టౌన్, ఫిబ్రవరి 13 : పరీక్షల సమయంలో భయంతో కాకుండా ఏకాగ్రతతో చదివితే పరీక్షలను సులభంగా రాయవచ్చని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు విద్యార్థులకు సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఠాగూర్ పాఠశాల ఆవరణలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఈవో మాట్లాడారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని, ఉపాధ్యాయులు బోధించిన ప్రతీ అంశాన్ని శ్రద్ధగా అర్థం చేసుకుని ప్రశాంతగా పరీక్షలు రాయాలన్నారు. పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో విద్యార్థుల్లో భయాన్ని తొలగించడానికే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సైకాలజిస్ట్ పి.లక్ష్మణ్ మాట్లాడుతూ అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఏకాగ్రతతో ప్రణాళికా బద్ధంగా చదువుకోవాలన్నారు. ఏదైనా సందేహం ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. భయంతో రాయడం వల్ల మార్కులు తక్కువగా వస్తాయని, భయం వీడి పరీక్షలు రాసి చూడు మంచి మార్కులు వస్తాయని తెలిపారు. అంతకు ముందు జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మండల విద్యాధికారి శంకర్రాథోడ్, స్థానిక ఉపాధ్యాయులు డీఈవో సుశీందర్రావు, సైకాలజిస్ట్ లక్ష్మణ్ను శాలువాలతో సన్మానించి మొక్కలను అందజేశారు. జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం పాండురంగయ్య గణితం, హస్నొద్దీన్ ఆంగ్లం, ప్రకాశ్ సైన్స్, ప్రభాకర్రెడ్డి సోషల్, గౌరీశంకర్ తెలుగు పాఠ్యాంశాలపై అవగాహన కల్పించారు.