రంగారెడ్డి, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): బాలికల్లో తలెత్తుతున్న ‘అనీమియా’ సమస్య ఆందోళన కలిగిస్తున్నది. చిన్నతనం నుంచే సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనత బారిన పడుతున్నారు. ఈ సమస్యను ఆరంభంలోనే గుర్తించి చెక్ పెట్టేందుకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో వైద్యపరీక్షలు నిర్వహించి బాధితుల ను గుర్తించి అవసరమైన మందులను అందిస్తున్నారు.
మారుతున్న ఆహార అలవాట్లతో నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం దేశ జనాభాలో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతుండ గా.. వారిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నట్లు తేలింది. మొదటి దశలోనే ఈ వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నారు.
వైద్యశాఖ ఆధ్వర్యంలో 14 బృందాలు ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలల్లో 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థినులకు రక్త పరీక్షలను చేయిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 32,107మంది కి పరీక్షలు నిర్వహించగా..466 మంది అనీమియా బారిన పడినట్లు గుర్తించారు. తీవ్రత ఎక్కువ ఉన్న వారిని జిల్లా ఆస్పత్రికి పంపి వైద్య సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో ఉన్నవారికి అక్కడికక్కడే మందులను అందజేయడంతోపాటు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉండడంతో రక్తహీనత ఏర్పడుతుంది. ఏ పని చేసినా త్వ రగా అలసిపోతారు. నిద్రలేమి, నీరసం, బరువు తగ్గ డం, ఎదుగుదల లోపం, పెదవులు తెల్లబడడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రక్తపరీక్షల్లో నాలుగు కేటగిరీలుగా రక్తహీనతను నిర్ధారిస్తున్నారు. సాధారణంగా 11-11.9 గ్రాముల మధ్య, అంతకంటే ఎక్కువ రక్తశాతం ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు.
అంతకన్నా తక్కువగా ఉంటే మైల్డ్ అనీమియా (మాధ్యమిక) స్థాయిగా నమోదు చేస్తున్నారు. 8-10.9 గ్రాములు ఉంటే మాడరేట్ (పరిమిత స్థాయి) అనీమియాగా గుర్తిస్తున్నారు. 8 గ్రాముల్లోపు వారిని సీవియర్ (తీవ్రత) అనీమియాగా గుర్తిస్తున్నారు. మైల్డ్ అనీమియా, మాడరేట్ అనీమియాగా గుర్తించిన వారికి పోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేసి వాడాలని సూచిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడే వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం అందిస్తే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.