రంగారెడ్డి, మార్చి 8(నమస్తే తెలంగాణ)/ షాద్నగర్ : జిల్లాలోని కొందుర్గు తహసీల్ ఆఫీసులో ఆర్వోఆర్, పహాణీ నకలుకు రూ.40వేలు డిమాండ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రికార్డు అసిస్టెంట్ బాలరాజ్ మరో ప్రైవేటు ఉద్యోగితో కలిసి లంచం డిమాండ్ చేశాడంటూ ఓ ఆర్మీ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు కలకలాన్ని రేపుతున్నది. తన పొలానికి సంబంధించిన ఆర్వోఆర్, పహాణీ నకలు కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. లంచం డిమాండ్ చేశారంటూ కొందుర్గు మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అశోక్ రెడ్డి సెల్ఫీ వీడియోతోపాటు పేటీఎంలో పంపిన డబ్బులకు సంబంధించి స్క్రీన్షాట్స్ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.
సార్.. అడుగుతున్నందునే డబ్బులు అడుగుతున్నామని లంచం డిమాండ్ చేశారని రికార్డు అసిస్టెంట్ బాలరాజ్, ప్రైవేటు ఉద్యోగి హేమంత్ల అవినీతి బాగోతాన్ని ఆర్మీ జవాన్ వీడియోలో వివరించారు. తహసీల్దార్తో తానే స్వయంగా ఎంతోకొంత మాట్లాడుకుంటానని చెప్పినప్పటికీ కలవనీయ లేదన్నారు. మూడు నాలుగు రోజుల తర్వాత రమ్మంటే తహసీల్ ఆఫీసుకు వెళ్లినట్లు తెలిపారు. సార్.. అడుగుతున్నాడని..డబ్బులు ఇవ్వకుంటే పని కాదని వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలుత రూ.10వేలు క్యాష్ ఇచ్చానని, ఆ తర్వాత ఆన్లైన్లో కొంత డబ్బు ఇచ్చానని.. అయినప్పటికీ మొత్తం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. నెల రోజుల సెలవుపై వచ్చానని, కశ్మీర్ వెళ్లాల్సి ఉందని చెప్పినా కనికరం చూపలేదన్నారు. డాక్యుమెంట్లు దొరికాయని, మొత్తం డబ్బులు ఇస్తేనే..ప్రింట్ తీసి సార్తో సంతకం పెట్టి ఇస్తామని కరాఖండిగా చెప్పారని వాపోయారు. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు సెక్షన్లో ఘోరంగా డబ్బులు తింటున్నారని పేర్కొన్నారు. హేమంత్ అనే వ్యక్తికి ఎటువంటి అపాయింట్మెంట్ లేదని, ప్రతి పనికీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.
కొందుర్గు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా తయారైందేమిటి! అని ఓ ప్రభుత్వ ఉద్యోగిగా షాక్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి కశ్మీర్కు వెళ్లిపోయి డ్యూటీలో చేరాక కొందుర్గు తహసీల్ ఆఫీసులో అవినీతిపై చిత్రీకరించిన వీడియోను, సెల్పీ వీడియోతోపాటు స్క్రీన్ షాట్స్ను ఆర్మీ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి అవినీతి బాగోతాన్ని గుట్టు రట్టు చేశారు. రెవెన్యూ అవినీతి బాగోతానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. దీనిపై వివరణ కోసం తహసీల్దార్, ఆర్డీవోలను ఫోన్లో సంప్రదించగా.. స్పందించలేదు.