కొడంగల్ : టీఆర్ఎస్ శ్రేణుల పండుగ వచ్చిందని, కమిటీ ఎన్నిక, టీఆర్ఎస్ జెండా అవిష్కణ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కేఎస్వీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కమిటీ ఎన్నిక, జెండా ఆవిష్కణల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల్లో ఉత్సహంతో ముందుకు సాగి కొడంగల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేసినట్లు తెలిపారు. ఇందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నిక ఏదైన టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా రానున్న ఎన్నికలను ఎదుర్కొనే విధంగా రాష్ట్ర పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు గాను మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 2నుంచి 12వ తేదీ వరకు గ్రామ కమిటీ, మున్సిపల్ వార్డు కమిటీలు, 12 నుంచి 20వ తేదీ వరకు మండల కమిటీ, మున్సిపల్ కొత్త కమిటీ ఎన్నికల నిర్వాహణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కమిటీ ఎన్నికలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరుపుకుందామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
టీఆర్ఎస్ జెండా అవిష్కణ కార్యక్రమం గ్రామ గ్రామాన వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, పీఎసీఎస్ అధ్యక్షులు కటకం శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డితో పాటు మూడు మండలాల టీఆర్ఎస్ మండల, గ్రామ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.