“జీవావరణంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా, విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మమేకమై సహజ సిద్ధంగా సంభవించే ఈ విపత్తులకు నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. వర్షాకాలం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో లోతట్టు ప్రాంతాలు, కుంటలు, చెరువులు, కట్టలు, మత్తళ్లు, నదులు,
పలు జలాశయాల ద్వారా ఆపద ముంచుకొస్తుందనే నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్ అయ్యింది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) 500 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. వారికి అధనంగా మరో 257 మందికి శిక్షణ ఇచ్చి విపత్తు ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. అన్ని రకాల విపత్తులను
ఎదుర్కొనేందుకు వారిని సంసిద్ధులను చేసింది.”
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): విపత్తు సమయాల్లో అద్భుత ప్రదర్శనతో ముందుండే ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతోంది. ఎలాంటి విపత్తులు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు ఈ విభాగం సంసిద్ధతతో ముందుంటుంది. ప్రస్తుతం 27 బృందాలతో 500 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు నిత్యం ప్రధానమైన ప్రదేశాల్లో అలర్ట్గా ఉంటూ విపత్తు నివారణ చర్యలు చేపడుతున్నది. అగ్ని ప్రమాదం, కుండపోత వర్షాల సమయంలో అద్భుత పనితీరు కనబరిచి, పౌరుల మన్ననలు అందుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో 257 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించి డీఆర్ఎఫ్ సిబ్బంది సంఖ్యను ఈవీడీఎం విభాగం పెంచుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రేడ్-1 మున్సిపాలిటీలలో డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి మార్గ దర్శకత్వంలో డీఆర్ఎఫ్ సిబ్బందికి నాగోల్ ఫతుల్గూడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీటీసీ) సెంటర్లో శిక్షణ ఇచ్చారు. గత నెల 8వ తేదీ నుంచి ఈ నెల 24 (శనివారం) వరకు ఏడో బ్యాచ్కు సంబంధించి 257 మందికి శిక్షణ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. పట్టణాలలో వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, భవనం కూలిపోవడం వంటి విపత్తుల సమయంలో నీరు నిలిచిపోవడం, చెట్లు కూలడం వంటి అంశాలపై శిక్షణ పొందారు. మంటలనే ఆర్పే పద్ధతులు, రెస్క్యూ మెథడ్స్, పట్టణ వరదలపై అవగాహన, భవనం కూలిపోవడం నుంచి ప్రజలను రక్షించడం, ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ విధానంలో భాగంగా సీపీఆర్, ప్రథమ శిక్షణ, యోగా వంటి వాటిపై అవగాహన కల్పించారు.