సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : సైబరాబాద్లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్స్టేషన్కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచించారు. శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గత ఏడాది 27322 కేసులు నమోదు కాగా 2023లో 29156 నమోదయ్యాయన్నారు. ఆస్తుల రికవరీలో 9 శాతం పెరుగుదల ఉందని వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. 3432 కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఆయా కేసుల్లో జైలు శిక్ష విధించాయని వివరించారు. సైబర్ నేరాలు ప్రతి యేడు పెరుగుతున్నాయని.. అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెరిగాయని.. సైబర్ నేరాల్లో పోయిన సొమ్ము విలువ రూ.232.34 కోట్లు ఉండగా రూ.46 కోట్ల రికవరీ జరిగిందని వెల్లడించారు. ట్రాఫిక్ విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఆర్థిక నేరాలు, భూ సంబంధిత నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయని, వీటిని ఎప్పటికప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారుల పనితీరుపై పరిశీలన
చట్ట ప్రకారం ఎవరి పని వాళ్లు చేస్తూ వెళ్లాల్సిన అవసరముందన్నారు. పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ స్థాయిలో సమస్యను పట్టించుకోలేదంటే ఏసీపీ, అదనపు డీసీపీ, డీసీపీలకు ఫిర్యాదు చేయాలని.. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తన వద్దకు సామాన్య ప్రజలు రావచ్చని సూచించారు. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు పరిశీలన ఉంటుందన్నారు. పైరవీలతో పోస్టింగ్లు ఉండవని, పనితీరు ఆధారంగానే పోస్టింగ్లుంటాయన్నారు. డ్రగ్స్ కేసుల్లో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్లో అది ఉందని, దానిని అమలు చేస్తామన్నారు. డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్స్ తయారీదారులతోపాటు వినియోగదారులపై నిఘా కొనసాగుతుందన్నారు. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు శబరీష్, శ్రీనివాస్రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆ కేసులను పరిశీలిస్తున్నాం
సమావేశంలో విలేకరులు పలు అంశాలను ప్రస్తావించారు. అందులో మొయెనాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించగా.. అది సుప్రీంకోర్టు విచారణలో ఉందన్నారు. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్కు సంబంధించి పేట్బషీర్బాగ్లో నమోదైన కేసు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించగా.. కేసు దర్యాప్తులో ఉందని, పరిశీలించాల్సి ఉందన్నారు. డ్రోన్ ఎగురవేతకు సంబంధించిన కేసును కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. రాయదుర్గంలో నమోదైన సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసుతో సంబంధమున్న వారిపై కూడా దర్యాప్తు జరుగుతున్నదని, కొందరికి నోటీసులిచ్చామన్నారు. సైబరాబాద్లో నమోదై గతంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించాల్సి ఉందని, ఆ తరువాత ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించగలమని సీపీ తెలిపారు.