పెద్దఅంబర్పేట్, జనవరి 11 : గంజాయి, డ్రగ్స్ నివారణకు హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ కమలాసన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ కమిషర్ రవికాంత్ పర్యవేక్షణలో సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్రావు, హనుమంత్రావు నేతృత్వంలో గురువారం ఉదయం 3 గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం సమీపంలోని రామోజీ ఫిలింసిటీ దగ్గరలో ఆంధ్ర, ఒడిశా, ఛత్త్తీస్గడ్ రాష్ర్టాల నుంచి వచ్చే అన్ని ప్రైవేట్, ఆర్టీసీ ఇతర వాహనాల రాకపోకలపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి 8 మంది ప్రయాణికుల నుంచి సుమారు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.
దీని విలువ సుమారు రూ.7లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఆంధ్రాలోని విశాఖజిల్లా పలాస, రాజమండ్రి, నర్సీపట్నం, అరకు, ఒడిశాలోని మల్కన్గిరి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పట్టుబడిన యువకులు తమ విచారణలో వెల్లడించారు. వీరు ఈ పని చేయడం వల్ల పదివేల రూపాయల వరకు కమీషన్ లభిస్తుందని, హయత్నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్గౌడ్ తెలిపారు.
యువత ఇలాంటి అక్రమ కేసుల్లో చిక్కుకొని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. దీన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ నిరంతరం చర్యలు చేపట్టిందని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో సరూర్నగర్ డీటీఎఫ్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు వెంకన్న, హనుమంతు, సరళ, పాషా ఉన్నారు.