షాద్నగర్టౌన్, జూలై 20: షాద్నగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి గురువారం ప్రజల ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకుండా ఇంటి వద్దనే ఉన్నారు. కురుస్తున్న వర్షంతో ప్రధాన దారులు, కాలనీల్లో వర్షపునీరు నిల్వడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మున్సిపాలిటీలోని శిథిలావస్థ ఇండ్లను, లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న పరిశీలించారు. కురుస్తున్న వర్షానికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. పట్టణ ప్రజలకు మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అదే విధంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలలోని చెరువులు, మురుగుకాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
శంకర్పల్లి : నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు జలమయమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని రిత్విక్ వెంచర్కు వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. సుమారు 50 కుటుంబాలు బిక్కు బిక్కు మంటున్నాయి. అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. మున్సిపాలిటీ, మండల పరిధిలోగల మూసి వాగు నిండు కుండలాగా ప్రవహిస్తున్నది. ప్రజలు ఎవ్వరూ అక్కడ సెల్ఫీలు దిగకూడదని పోలీసులు హెచ్చరించారు.
కడ్తాల్ మండలంలో విస్తారంగా వానలు
కడ్తాల్ : మండల వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వానలతోపాటు ఆకాశమంతా మేఘావృత్తమై చల్లటి గాలులు వీస్తున్నాయి. మండలంలో కరుస్తున్న వానలతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. కాస్త ఆలస్యమైనా కురుస్తున్న వానలతో వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని రైతన్నలు ఆనందపడుతున్నారు. చాలా గ్రామాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఈదురుగాలులుతో కురుస్తున్న వానలకు కొండ్రిగానిబోడు గ్రామ పంచాయతీలోని పిల్లిగుండ్ల తండాలో వాల్యానాయక్కు చెందిన ఆవు మృతి చెందింది. ఆవు మృతదేహాన్ని మండల పశువైద్యాధికారి పరిశీలించారు. కడ్తాల్లో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తంగడిపల్లిలో కూలిన గోడ
చేవెళ్ల రూరల్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్లి వ్యక్తి గత పనులు చూసుకోవాలన్నా వర్షం తగ్గకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. మండల పరిధిలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది నర్సింహులుకు చెందిన ఇల్లు వెనుక భాగం గోడ కూలిపోయింది. వర్షానికి మండలంలోని కుమ్మెర గ్రామంలో చిన్న పెంటయ్యకు చెందిన 20 గొర్రెలు, మూడు మేకలు మృతి చెందాయి. మండల పరిధిలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండల పరిధిలోని దేవరంపల్లి ఈసీ వాగులోకి వరద నీరు అధికంగా చేరడంతో ఉప్పొంగి పారుతున్నది. దీంతో ఈసీ వాగును తిలకించడానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
నందిగామ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, వైర్ల దగ్గరికి వెళ్లకూడదని, శిథిలావస్థలోని ఇండ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అధికారులను సంప్రదించాలని తెలిపారు.
కేశంపేట : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న నీటితో కాలువలు, వంకలు పారుతున్నాయి. గురువారం ఉదయం నుంచి వర్షం కాస్త ఎక్కువగా కురుస్తుండటంతో చెరువుల్లోకి వర్షపు నీరు చేరుతున్నది. సాగు చేసిన పంటలకు చాలా మేలు చేసింది. వర్షాలు మరో రెండు, మూడు రోజులు ఇదే విధంగా కురిస్తే మండలంలోని చెరువులు నిండే అవకాశం ఉంది.
కొత్తూరు : బుధవారం సాయంత్రం నుంచి కొత్తూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం ఉదయం 9 గంటలకు వరకు 8.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రాలేదు. అలాగే రోడ్లపై నీరు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో కురుస్తున్న వర్షం వల్ల వాగులు, వంకల్లో నీటి ప్రవాహం ప్రారంభమైంది. కొత్తూరు మున్సిపాలిటీలో ఎమర్జెనీ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వీరేందర్ చెప్పారు.