శివారు ప్రాంతాల్లో తాగునీటికి రూ.1200 కోట్ల నిధులు
కేటీఆర్ బర్త్డే రోజున 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
తుక్కుగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
షాబాద్, జూలై 17 : పట్టణ ప్రగతితో పట్టణాలను స్వచ్ఛంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డిజిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రావిర్యాల లేక్ బండ్ వద్ద రూ.15.50లక్షలతో తాగునీటి పైపులైన్ పనులకు, రూ.14.75లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు, రావిర్యాల చర్చి వెనుకాల, సర్దార్ యూత్ అసోసియేషన్ వద్ద రూ.30లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పాఠశాల వద్ద రూ.20లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు, దేవేందర్నగర్ కాలనీలో రూ.14లక్షలతో సీసీ రోడ్డు పనులు, తాగునీటి పైపులైన్ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.1200 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా మున్సిపాలిటీలలో
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, తుక్కుగూడలో రూ.4.50కోట్లతో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తుక్కుగూడలో మూడు ఎకరాల స్థలంలో రూ.కోటితో వైకుంఠధామం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, సర్దార్నగర్, మంఖాల్లో డంపింగ్యార్డుల నిర్మాణం చేపడుతారన్నారు. ప్రధాన రోడ్డు వెడల్పు కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా పూర్తి బడ్జెట్లో 10శాతం గ్రీన్ బడ్జెట్కు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రగతిలో ప్రతి నెల మున్సిపాలిటీలకు రూ.2.211కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి నెలనెలా రూ.26లక్షల కేటాయిస్తున్నట్లు చెప్పారు.
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఒకే రోజు మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రావిర్యాలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.2కోట్లతో హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండేండ్లలో నియోజకవర్గంలో 5వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించాన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించిన విద్యుత్ సమస్యలను పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.